నటుడు విశాల్ హెల్త్ అప్‌డేట్.. ఆందోళ‌న అక్క‌ర్లేద‌న్న విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ

  • కూవాగం వేడుకల్లో నటుడు విశాల్‌కు అస్వస్థత
  • వేదికపై ఉన్న న‌టుడు ఒక్క‌సారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోయిన వైనం
  • దీంతో విశాల్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళ‌న‌
  • ఆయ‌న పూర్తి ఆరోగ్య‌వంతంగా ఉన్న‌ట్లు విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వెల్ల‌డి
త‌మిళ‌నాడులోని విల్లుపురం జిల్లా కూవాగంలోని కుత్తాండ‌వ‌ర్ ఆలయ చిత్తిరై (తమిళ మాసం) ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ట్రాన్స్‌జెండర్ల కోసం ‘మిస్‌ కూవాగం 2025’ అందాల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు విశాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

అయితే, కార్యక్రమం జరుగుతుండగా వేదికపై ఉన్న విశాల్ ఒక్క‌సారిగా స్పృహ కోల్పోయి కిందకు పడిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కావ‌డంతో అభిమానులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

ఈ నేప‌థ్యంలో విశాల్ ఆరోగ్యంపై ఆయ‌న సొంత‌ నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అప్‌డేట్ ఇచ్చింది. ఈ మేర‌కు ఒక ప్రెస్‌ నోట్ విడుద‌ల చేసింది. "విశాల్ ఆరోగ్యం గురించి తాజాగా వచ్చిన వార్తలపై మేము స్ప‌ష్ట‌త ఇవ్వాలనుకుంటున్నాం. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాల్ కొద్దిసేపు అలసటతో స్పృహ కోల్పోయారు. 

ఆ రోజు మధ్యాహ్నం ఆయ‌న‌ భోజనం చేయ‌లేదు. కేవ‌లం జ్యూస్ మాత్రమే తాగారు. దాని వల్ల ఆయ‌న అల‌స‌ట‌తో స్పృహ కోల్పోయి ప‌డిపోయారు. వెంటనే ఆయ‌న్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు క్షుణ్ణంగా ప‌రీక్షించారు.

అదృష్టవశాత్తూ, ఆందోళన చెందడానికి ఎటువంటి అనారోగ్య‌ కారణం లేద‌న్నారు. విశాల్ ఆరోగ్యం బాగానే ఉందని వైద్య బృందం నిర్ధారించింది. భవిష్యత్తులో క్రమం తప్పకుండా భోజన సమయాలను కొనసాగించాలని సూచించింది. ఆయ‌న‌ ప్రస్తుతం బాగానే ఉన్నారు. విశ్రాంతి తీసుకుని కోలుకుంటున్నారు. విశాల్‌కు నిరంతర మద్దతుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేర్కొంది.


More Telugu News