హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం
- భాగ్యనగరంలో ప్రపంచ సుందరి పోటీల కోలాహలం
- 110 దేశాల అందగత్తెల రాక
- గచ్చిబౌలిలో అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు
ప్రారంభోత్సవ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాగింది. 'జయజయహే తెలంగాణ' రాష్ట్ర గీతాలాపనతో పోటీలు అధికారికంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా 250 మంది కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యం ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. పరిచయ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన పోటీదారులు తమ తమ విభిన్న వస్త్రధారణలతో ర్యాంప్పై హోయలొలికించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ ప్రారంభోత్సవ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


