కూలిపోయింది భారత్ యుద్ధ విమానమా? కేంద్రం ఏం చెబుతోందంటే...!

  • ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రతీకార దాడులు చేశామంటూ పాక్ దుష్ప్రచారం
  • శ్రీనగర్ ఎయిర్‌బేస్‌పై దాడి, రాఫెల్ కూల్చివేత అంటూ ప్రచారం.
  • పాత ఫోటోలు, వీడియోలతో పాక్ అనుకూల ఖాతాల తప్పుడు ప్రచారం
  • అసత్యాలను ఖండించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ)
భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) మరియు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషన్ సింధూర్' పేరిట చేపట్టిన నిర్దిష్ట దాడుల అనంతరం, పాకిస్థాన్ సోషల్ మీడియా వేదికగా భారత్‌పై ప్రతీకార దాడులు చేశామంటూ తీవ్రస్థాయిలో దుష్ప్రచారానికి తెరలేపింది. శ్రీనగర్ ఎయిర్‌బేస్‌పై దాడి చేశామని, ఒక భారతీయ రాఫెల్ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ప్రచారం చేసుకుంది. దీనికి మద్దతుగా పాత ఫోటోలు, సంబంధం లేని వీడియోలను ఉపయోగించింది. ముఖ్యంగా, విమాన శకలాలను జేసీబీతో తరలిస్తున్న ఫొటోను వైరల్ చేసింది.

దీనిపై భారత కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని భారత ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్-చెక్ విభాగం స్పష్టం చేసింది. ఈ చిత్రం పాతదని, ప్రస్తుత ఆపరేషన్‌కు సంబంధించింది కాదని తేల్చిచెప్పింది. అదేవిధంగా, శ్రీనగర్ ఎయిర్‌బేస్‌ను పాక్ వైమానిక దళం లక్ష్యంగా చేసుకుందని చూపుతున్న వీడియో కూడా పాతదని, అది పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో జరిగిన మత ఘర్షణలకు సంబంధించినదని పీఐబీ స్పష్టం చేసింది.





More Telugu News