ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం మాకు లేదు.. కానీ: అజిత్ దోవల్
- ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన అజిత్ దోవల్
- పాకిస్థాన్ చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ సిద్ధమని స్పష్టీకరణ
- అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ సహా పలు దేశాల ప్రతినిధులతో మాట్లాడిన దోవల్
అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ సహా పలు దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులతో అజిత్ దోవల్ ప్రత్యేకంగా మాట్లాడారు. పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు జరిపిన కచ్చితత్వంతో కూడిన దాడుల గురించి, ఉద్రిక్తతలను మరింత పెంచకుండా ఉండేందుకు భారత్ తీసుకుంటున్న చర్యల గురించి వారికి సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగానే, భారత వైఖరిని ఆయన కుండబద్దలు కొట్టినట్లు తెలియజేశారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే ఎంతటి చర్యలకైనా వెనుకాడబోమని పరోక్షంగా హెచ్చరించారు.
"ఉద్రిక్తతలను పెంచాలన్నది మా ఉద్దేశం కాదు. అయితే, పాకిస్థాన్ గనుక ఏదైనా సాహసానికి ఒడిగడితే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దానికి తగిన విధంగా, దృఢంగా ప్రతిస్పందించడానికి మేం సిద్ధంగా ఉన్నాం" అని దోవల్ స్పష్టం చేశారు. పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థల నిర్మూలనే లక్ష్యంగా, ఆ దేశంలోని సాధారణ పౌరులకు ఎలాంటి హానీ కలగకుండా ఈ దాడులను అత్యంత కచ్చితత్వంతో, వ్యూహాత్మకంగా నిర్వహించామని కూడా ఆయన అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు.