నష్టాన్ని భరిస్తాం కానీ పాకిస్థాన్‌కు టమాటాలు పంపించేది లేదు: కోలార్ టమాటా వ్యాపారుల తీర్మానం

  • పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు టమాటా ఎగుమతుల నిలిపివేత
  • కర్ణాటకలోని కోలార్ టమాటా వ్యాపారులు, రైతుల నిర్ణయం
  • ఆసియాలోనే అతిపెద్దదైన కోలార్ మార్కెట్ నుంచి ఎగుమతులు బంద్
  • ఆదాయ నష్టాన్ని భరించి, ఎగుమతులు ఆపేస్తున్నట్లు ప్రకటన
  • గతంలో మానవతా దృక్పథంతో పంపినా, తాజా దాడి తర్వాత వద్దని తీర్మానం
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో కర్ణాటకలోని కోలార్ టమాటా వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్‌కు టమాటా ఎగుమతులను పూర్తిగా నిలిపివేయాలని వారు తీర్మానించారు. ఈ నిర్ణయంతో ఆర్థిక నష్టాన్ని భరించడానికైనా సిద్ధమని వారు స్పష్టం చేశారు.

ఆసియాలోనే అతిపెద్ద టమాటా మార్కెట్‌గా పేరుగాంచిన కోలార్‌లో రోజుకు సుమారు 800 నుంచి 900 టన్నుల టమాటా లావాదేవీలు జరుగుతుంటాయి. ముఖ్యంగా జూన్ నెల టమాటా రైతులకు, వ్యాపారులకు అత్యంత కీలకమైన సమయం. ఈ సమయంలోనే ఎగుమతులు అత్యధికంగా ఉంటాయి. అయినప్పటికీ, పహల్గామ్ ఘటన తర్వాత దేశ ప్రయోజనాల దృష్ట్యా పాకిస్థాన్‌కు ఎగుమతులు చేయకూడదని స్థానిక రైతులు, వ్యాపారులు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.

గతంలో ఉగ్రదాడులు జరిగినప్పటికీ, మానవతా దృక్పథంతో పాకిస్థాన్‌కు టమాటా ఎగుమతులు కొనసాగించామని, కానీ పహల్గామ్‌లో అమాయక యాత్రికులపై జరిగిన దాడి తర్వాత తమ వైఖరి మార్చుకున్నామని వ్యాపారులు తెలిపారు. "పహల్గామ్ దుర్ఘటన తర్వాత ఒక్క టమాటా కూడా ఆ దేశానికి పంపబోము" అని వారు దృఢంగా చెప్పారు. ఆదాయం కంటే దేశ భద్రత, గౌరవమే తమకు ముఖ్యమని వారు పేర్కొన్నారు.


More Telugu News