YS Sharmila: మోదీ గారూ... ఈసారైనా అమరావతి కట్టేనా? లేక మళ్ళీ మట్టేనా?: షర్మిల

- అమరావతిపై ప్రధాని మోదీకి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నలు
- గత హామీల గుర్తుగా అమరావతి మట్టిని ప్రధానికి పంపుతున్నట్లు వెల్లడి
- రాజధాని నిర్మాణానికి రూ.1.5 లక్షల కోట్లు బేషరతుగా ఇవ్వాలని డిమాండ్
- ఢిల్లీని మించిన రాజధాని కడతామని లిఖిత హామీ కోరిన షర్మిల
- విభజన హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం, విభజన హామీల అమలు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏపీ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, అమరావతి మట్టిని ప్రధానికి బహుమతిగా పంపుతున్నట్లు ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
"ప్రధాని నరేంద్ర మోదీ గారూ, ఈసారైనా అమరావతి నిర్మాణం జరుగుతుందా? లేక మళ్లీ మట్టి మాత్రమేనా?" అంటూ షర్మిల సూటిగా ప్రశ్నించారు. పదేళ్ల క్రితం శంకుస్థాపన పేరుతో మట్టి తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో కొట్టారని, ఆశలపై నీళ్లు చల్లి వెళ్లారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపన పేరుతో వస్తున్న మోదీకి, గత హామీలను గుర్తు చేయడానికే ఈ అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామని షర్మిల తెలిపారు. ఈ మట్టిని చూసిన ప్రతిసారీ 2015 నాటి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలని, పదేళ్లుగా జరిగిన జాప్యంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె హితవు పలికారు.
ప్రధాని మోదీ అమరావతి గడ్డపై అడుగుపెట్టే ముందు, ఇక్కడి మట్టి సాక్షిగా ప్రమాణం చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. మరోసారి ఆంధ్రులను మోసం చేయబోనని ఆయన స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణం పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేసిన షర్మిల, ఆ బాధ్యతకు కట్టుబడి ఉంటానని, ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తానని ప్రధాని లిఖితపూర్వకంగా సంతకం చేసి ఇవ్వాలని అన్నారు.
రాష్ట్ర ప్రజలకు అప్పుల భారం వద్దని, రాజధాని నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం బేషరతుగా రూ. 1.50 లక్షల కోట్లను మూడేళ్ల కాలంలో విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాని మోదీ స్వయంగా ప్రకటన చేయాలని కోరారు. అదేవిధంగా, అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. గడిచిన పదేళ్లుగా అమలుకు నోచుకోని ఇతర విభజన హామీల అమలుపై కూడా ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు.

