KCR: ఎల్కతుర్తి సభలో రామాయణం చెప్పిన కేసీఆర్

- వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ
- పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగం.
- తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, ఎదురైన అవమానాలు ప్రస్తావించిన గులాబీ బాస్
- పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అద్భుతంగా నిర్మించామని వ్యాఖ్య.
- అమరవీరులకు నివాళి, వరంగల్ గడ్డ ప్రాశస్త్యంపై వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని, ఎదురైన సవాళ్లను, సాధించిన విజయాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని వివరిస్తూ, కేసీఆర్ రామాయణంలోని ఓ ఘట్టాన్ని ఉదహరించారు. రావణ సంహారం తర్వాత లంకను చూసి, అది సువర్ణమయంగా ఉందని, అయోధ్యకు బదులు అక్కడే ఉండి పరిపాలన చేద్దామని లక్ష్మణుడు సహా పలువురు సూచించగా, శ్రీరాముడు అంగీకరించలేదని కేసీఆర్ తెలిపారు. "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి" అన్న సూక్తిని గుర్తు చేస్తూ, కన్నతల్లిని, జన్మభూమిని మించిన స్వర్గం లేదని, అందుకే రాముడు అయోధ్యకు తిరిగి వచ్చారని వివరించారు. అదే స్ఫూర్తితో, వలసవాదుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న, ఆత్మహత్యలు, వలసలతో నిండిన తెలంగాణ విముక్తి కోసం, స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా తాను ఒక్కడినే బయలుదేరి ఉద్యమానికి శ్రీకారం చుట్టానని కేసీఆర్ పేర్కొన్నారు.
25 ఏళ్ల క్రితం ఎగిరిన గులాబీ జెండా ప్రస్థానంలో ఎన్నో అవమానాలు, ఎగతాళి, అవహేళనలు ఎదుర్కొన్నామని కేసీఆర్ అన్నారు. "మఖలో పుట్టింది పుబ్బలో పోతుంది" అని కొందరు అన్నా, అనేక మంది త్యాగాలు, వందలాది మంది బలిదానాలు, అద్భుతమైన ఉద్యమాలతో యావత్ తెలంగాణ ఏకతాటిపై నిలిచిందని తెలిపారు. ఒకానొక దశలో తెలంగాణ మొత్తం బరిగీసి నిలబడి తమ రాష్ట్రం తమకు కావాలని డిమాండ్ చేసే పరిస్థితిని సృష్టించామని, చివరికి రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన గుర్తు చేశారు.
ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత, పదేళ్ల పాటు అద్భుతమైన పాలన అందించి, అందరూ బిత్తరపోయేలా, ఆశ్చర్యపోయేలా తెలంగాణను నిర్మాణం చేసుకున్నామని కేసీఆర్ తెలిపారు. పార్టీ 25 ఏళ్ల సుదీర్ఘ చరిత్రను పురస్కరించుకుని వరంగల్లో రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా వరంగల్ గడ్డ ప్రాశస్త్యాన్ని కేసీఆర్ కొనియాడారు. రాణి రుద్రమ ఏలిన వీరగడ్డ, సమ్మక్క సారక్కల పోరాటాలకు నెలవైన నేల, బమ్మెర పోతన కవిత్వ మాధుర్యాన్ని పంచిన జీవగడ్డ అయిన వరంగల్ నేలకు వందనం చేస్తున్నానని చెప్పారు.