KCR: ఎల్కతుర్తికి చేరుకున్న కేసీఆర్... ఎటు చూసినా గులాబీమయం

- నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ
- గులాబీమయం అయిన ఎల్కతుర్తి
- ఎర్రవెల్లి నుంచి హెలికాప్టర్ లో విచ్చేసిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో సభా స్థలికి విచ్చేశారు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే పార్టీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు కేసీఆర్ను వేదిక వద్దకు ఆహ్వానించారు.
హెలికాప్టర్లో ఉండగానే కేసీఆర్ కిందకు చూస్తూ సభకు హాజరైన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం తెలిపారు. ఆయన్ను చూసేందుకు సభా ప్రాంగణంలో పెద్ద ఎత్తున గుమిగూడిన ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శించారు. 'జై కేసీఆర్', 'జై తెలంగాణ' అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ తమ మద్దతును తెలియజేశారు. గులాబీ జెండాలు రెపరెపలాడిస్తూ తమ నాయకుడికి స్వాగతం పలికారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. వేదికకు కిలోమీటర్ల దూరం వరకు ప్రజలు బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారులు తమ ఆటపాటలతో సభకు వచ్చిన వారిలో ఉత్సాహం నింపారు. తెలంగాణ పాటలకు అనుగుణంగా పలువురు కార్యకర్తలు, ప్రజలు నృత్యాలు చేస్తూ కనిపించారు. మొత్తం మీద సభా ప్రాంగణం సందడిగా, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగుతోంది.

