US Immigration: 'సెవిస్' రద్దుపై కోర్టు కీలక ఆదేశం.. అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట

- అమెరికాలో 133 మంది అంతర్జాతీయ విద్యార్థుల సెవిస్ రికార్డుల పునరుద్ధరణ.
- మూర్తి లా ఫర్మ్ దావాతో జార్జియా ఫెడరల్ జడ్జి తాత్కాలిక ఉత్తర్వులు.
- చిన్న కారణాలతో వీసాలు, సెవిస్ రద్దు చేసినట్లు ఆరోపణలు.
- బాధిత విద్యార్థుల్లో 50 శాతం మంది భారతీయులే
అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు, స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(సెవిస్) రికార్డుల రద్దు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూర్తి లా ఫర్మ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై స్పందించిన జార్జియాలోని ఫెడరల్ జడ్జి, చట్టవిరుద్ధంగా 'సెవిస్' రికార్డులు రద్దు చేయబడిన 133 మంది విద్యార్థులకు తాత్కాలిక ఊరట కల్పించారు. వారి 'సెవిస్' రికార్డులను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశిస్తూ తాత్కాలిక ఉత్తర్వులు(టీఆర్ఓలు) జారీ చేశారు.
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ , ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు ఇటీవల అనేక మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసి, వారి 'సెవిస్' రికార్డులను రద్దు చేస్తున్నాయి. చాలా సందర్భాలలో నేరారోపణలు రుజువు కాకపోయినా, కేవలం చిన్న చిన్న సమస్యలు (ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటివి) పేర్కొంటూ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ప్రకారం, 2025 జనవరి 20 నుంచి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రద్దు చేసిన 4,736 సెవిస్ రికార్డులలో 50 శాతం మంది భారతీయ విద్యార్థులే కావడం గమనార్హం. వీరిలో ఎక్కువ మంది ఎఫ్-1 వీసా హోల్డర్లు, ఆప్టిమల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) చేస్తున్నవారే ఉన్నారు. ఓపీటీలో ఉన్నవారు ఇప్పటికే చదువు పూర్తిచేసి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు.
మూర్తి లా ఫర్మ్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, కోర్టు జారీ చేసిన టీఆర్ఓలు ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. కేసులో తుది తీర్పు వచ్చేవరకు విద్యార్థుల 'సెవిస్' రికార్డులు పునరుద్ధరించబడతాయి. అయినప్పటికీ టీఆర్ఓ మంజూరు చేయడం... కేసులో విజయావకాశాలు బలంగా ఉన్నాయని సూచిస్తుందని వారు పేర్కొన్నారు.
చిన్న చిన్న కారణాలు, కొన్నిసార్లు నిరసనల సమీపంలో ఉండటం లేదా అభిప్రాయాలు వ్యక్తం చేయడం వంటి వాటికే 'సెవిస్' రద్దు చేస్తున్నారని, దీనికి స్పష్టమైన నియమ నిబంధనలను ప్రభుత్వం ఉదహరించడం లేదని న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ చర్యలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురవుతున్నారు. విద్యాభ్యాసం మధ్యలో ఉన్నవారు, భారీగా పెట్టుబడులు పెట్టినవారు భవిష్యత్తుపై అనిశ్చితితో కొట్టుమిట్టాడుతున్నారు. 'సెవిస్' రద్దు చేస్తే విద్యార్థి హోదా కూడా రద్దయినట్లేనా, కాదా అనే దానిపై కూడా స్పష్టత కొరవడిందని మూర్తి లా ఫర్మ్ తెలిపింది.