బెంగళూరులో భారత వాయుసేన అధికారిపై బైకర్ దాడి

  • కన్నడలో మాట్లాడాలంటూ బెంగళూరులో ఐఏఎఫ్ అధికారి దంపతులపై దాడి!
  • వింగ్ కమాండర్ ఆదిత్య బోస్‌పై కీతో, రాయితో దాడి చేసిన బైకర్
  • దాడిలో ఆదిత్య బోస్‌ తలకు గాయాలు
  • సహాయం చేయకుండా స్థానికులు దూషించారని అధికారి ఆవేదన.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో విస్మయపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భారత వాయుసేన (IAF) అధికారి, ఆయన భార్యపై ఆదివారం సాయంత్రం ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. వింగ్ కమాండర్ ఆదిత్య బోస్, ఆయన భార్య స్క్వాడ్రన్ లీడర్ మధుమిత ఈ దాడికి గురయ్యారు. కన్నడంలో మాట్లాడాలంటూ ఆ వ్యక్తి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

విమానాశ్రయానికి వెళుతుండగా ఘటన

అందిన సమాచారం ప్రకారం, ఈ దంపతులు సీవీ రామన్ నగర్‌లోని డీఆర్‌డీఓ కాలనీ నుంచి విమానాశ్రయానికి తమ కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో ఓ మోటార్ సైకిల్ పై వచ్చిన వ్యక్తి తమ కారును వెంబడించడం ప్రారంభించాడని వింగ్ కమాండర్ బోస్ తెలిపారు. ఆ వ్యక్తి కన్నడ భాషలో తమను దూషించడం మొదలుపెట్టాడని ఆయన ఆరోపించారు.

డీఆర్‌డీఓ స్టిక్కర్ చూసి రెచ్చిపోయిన దుండగుడు

కొద్దిసేపటి తర్వాత, ఆ బైకర్ అకస్మాత్తుగా తన వాహనాన్ని వారి కారు ముందు ఆపివేసి, మళ్లీ దుర్భాషలాడటం ప్రారంభించాడని బోస్ వివరించారు. తమ కారుపై ఉన్న డీఆర్‌డీఓ (DRDO) స్టిక్కర్‌ను గమనించిన తర్వాత ఆ దుండగుడు మరింత దూకుడుగా ప్రవర్తించాడని, తన భార్యను కూడా అసభ్య పదజాలంతో దూషించాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బైక్ కీతో, రాయితో దాడి... గాయాలు

దీనిపై ప్రశ్నించేందుకు వింగ్ కమాండర్ బోస్ కారు దిగగా, ఆ బైకర్ తన వద్ద ఉన్న కీ (తాళం చెవి)తో బోస్ నుదుటిపై దాడి చేశాడని బాధితుడు ఆరోపించారు. అంతటితో ఆగకుండా, ఆ వ్యక్తి ఓ రాయిని తీసుకుని వారి కారుపైకి విసిరాడని, ఆ రాయి కూడా బోస్ తలకు తగిలి మరో గాయమైందని ఆయన తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో.. స్థానికుల తీరుపై అధికారి ఆవేదన

దాడి అనంతరం, రక్తంతో తడిసిన ముఖంతో వింగ్ కమాండర్ బోస్ ఈ ఘటనపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. జరిగిన సంఘటనను వివరిస్తూ, దాడి సమయంలో చుట్టూ ఉన్నవారు సహాయం చేయడానికి ముందుకు రాకపోగా, తమనే దూషించారని ఆయన తీవ్ర నిరాశ, ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితులు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


More Telugu News