పోప్ ఫ్రాన్సిస్ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది: పవన్ కల్యాణ్
- ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారన్న ఉప ముఖ్యమంత్రి
- ఆయన మార్గదర్శకత్వం అందరికీ నిదర్శనమని వ్యాఖ్య
- పోప్ ఫ్రాన్సిస్ బోధనలు ఎప్పటికీ నిలిచిపోతాయన్న కిషన్ రెడ్డి
ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది క్రైస్తవులకు ఆదర్శంగా నిలిచిన పోప్ ఫ్రాన్సిస్ మృతి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గదర్శకత్వం, కరుణ, మానవత్వం అందరికీ ఆదర్శమని, ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ప్రపంచ క్రైస్తవ సమాజానికి పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు.
ఆయన బోధనలు ఎప్పటికీ నిలిచిపోతాయి: కిషన్ రెడ్డి
పోప్ ఫ్రాన్సిస్ మరణం తనకు చాలా బాధ కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శాంతి, ప్రేమ, కరుణ గురించి ఆయన బోధనలు ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు. ప్రపంచ క్యాథలిక్ సమాజానికి సంతాపం తెలిపిన కిషన్ రెడ్డి, పోప్ ఫ్రాన్సిస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.