పడిక్కల్ మాస్, కోహ్లీ క్లాస్... పంజాబ్ పై ఆర్సీబీ ఈజీ విక్టరీ

  • పంజాబ్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో విజయం
  • విరాట్ కోహ్లీ (73*) అజేయ అర్ధశతకం, దేవదత్ పడిక్కల్ (61) మెరుపు ఇన్నింగ్స్
  • పంజాబ్ కింగ్స్ స్కోరు 20 ఓవర్లలో 157/6 
  • 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్టుపై ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

విరాట్ కోహ్లీ (73 నాటౌట్; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), దేవదత్ పడిక్కల్ (61; 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు) అద్భుత అర్ధశతకాలతో రాణించడంతో ఆర్‌సీబీ సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది.

158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫిలిప్ సాల్ట్ (1) అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే, క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్, మరో ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ముఖ్యంగా పడిక్కల్ దూకుడుగా ఆడి పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. కోహ్లీ, పడిక్కల్ కలిసి రెండో వికెట్‌కు కీలకమైన 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

పడిక్కల్ ఔటైన తర్వాత వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ (12) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. అయితే, విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజులో నిలిచి, బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆర్‌సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 159 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, యజ్వేంద్ర చాహల్ తలో వికెట్ పడగొట్టారు. 





More Telugu News