Omar Abdullah: ఢిల్లీలో దిగాల్సిన విమానం జైపూర్​కు మళ్లింపు.. ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు విమాన ప్రయాణంలో తీవ్ర అసౌకర్యం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానాన్ని గంటల తరబడి గాల్లోనే ఉంచి, అర్ధరాత్రి సమయంలో జైపూర్‌కు మళ్లించడంతో ఢిల్లీ విమానాశ్రయ అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ నుంచి ఢిల్లీకి బయలుదేరిన తమ విమానం దాదాపు 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిందని, ఆపై ఉన్నట్టుండి దాన్ని జైపూర్‌కు మళ్లించారని ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

అర్ధరాత్రి దాదాపు ఒంటి గంట సమయంలో జైపూర్‌లో విమానం దిగాక, మెట్లపై నిలబడి తాజా గాలి పీల్చుకుంటున్న ఫోటోను ఆయన పంచుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయ నిర్వహణ అత్యంత దారుణంగా ఉందని, అందుకే తమ విమానం ఇలా దారి మళ్లిందని ఆయన ఘాటుగా విమర్శించారు. ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతామో కూడా తెలియడం లేదని ఆ సమయంలో పేర్కొన్నారు. చివరికి తెల్లవారుజామున 3 గంటల తర్వాత తాను ఢిల్లీ చేరుకున్నట్లు మరో పోస్టులో తెలిపారు. ఒమర్ అబ్దుల్లా చేసిన విమర్శలపై ఢిల్లీ విమానాశ్రయ అధికారులు గానీ, ఇండిగో సంస్థ ప్రతినిధులు గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
 
 మరోవైపు, శనివారం శ్రీనగర్‌లో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో జమ్మూ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అనేక విమానాలు ఆలస్యమవ్వగా, కొన్ని రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఇండిగో సంస్థ కూడా ప్రయాణికులకు సూచనలు జారీ చేసింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకునే వెసులుబాటును పరిశీలించాలని సూచించింది.
Omar Abdullah
Indigo Airlines
Delhi Airport
Flight Diversion
Jammu Airport
Flight Delay
Air Travel Issues
Weather Disruption
India
Airports

More Telugu News