Elon Musk: మోదీతో ఫోన్ టాక్ అనంతరం... భారత పర్యటనపై క్లారిటీ ఇచ్చిన మస్క్

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం, టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ త్వరలో భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో సంభాషించిన అనంతరం, ఈ ఏడాది చివర్లో భారత్‌కు వస్తానని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' (గతంలో ట్విట్టర్) లో చేసిన ఒక పోస్ట్‌కు ఎలాన్ మస్క్ స్పందించారు. "ప్రధాని మోదీతో మాట్లాడటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను" అని మస్క్ పేర్కొన్నారు. "ఈ ఏడాది చివర్లో భారత్‌ను సందర్శించేందుకు ఎదురుచూస్తున్నాను!" అని తన ట్వీట్ లో తెలిపారు.

కాగా, ప్రధాని మోదీ తాను ఎలాన్ మస్క్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు నిన్న వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలో మస్క్‌తో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను ఈ సంభాషణలో మరోసారి ప్రస్తావించుకున్నట్లు ప్రధాని తెలిపారు. 

గత జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీలో ఎలాన్ మస్క్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ భేటీలో ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష రంగం వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విభాగాల్లో భవిష్యత్ సహకారంపై ఇరువురు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవల అనుమతుల కోసం భద్రతాపరమైన అంశాలు పరిశీలనలో ఉన్నాయని వార్తలు వస్తున్న తరుణంలో, అలాగే న్యూఢిల్లీ-వాషింగ్టన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ-మస్క్ తాజా సంభాషణ, మస్క్ పర్యటన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Elon Musk
India Visit
Narendra Modi
Tesla
SpaceX
Starlink
India-US Trade
Technology
Renewable Energy
Electric Vehicles

More Telugu News