"భారతీయులకు ఇలా జరగాల్సిందే"... 26/11 దాడుల తర్వాత హెడ్లీతో చెప్పిన రాణా

Tahawwur Rana Extradited to India 2611 Masterminds Arrest
2008 ముంబై దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణా (64)ను అమెరికా నుంచి భారత్ కు అప్పగించారు. పాకిస్థాన్ మూలాలున్న కెనడా దేశస్థుడైన రాణా, ముంబై దాడుల్లో 166 మంది మృతికి కారణమైన కుట్రలో పాలుపంచుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దాదాపు రెండు దశాబ్దాలపాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత రాణా భారత్‌కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పాకిస్తాన్ ఆర్మీలో వైద్య అధికారిగా పనిచేసిన రాణా, ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్‌గా మారాడు. బాల్య స్నేహితుడు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీకి సహాయం చేయడం ద్వారా ముంబై దాడులకు రాణా సహకరించాడని ఆరోపణలు ఉన్నాయి. 

దాడుల అనంతరం, రాణా " భారతీయులు దీనికి అర్హులే... వారికి ఇలా జరగాల్సిందే" అని హెడ్లీతో చెప్పాడని, అంతేకాకుండా దాడిలో మరణించిన లష్కరే తోయిబా ఉగ్రవాదులను పాకిస్తాన్ అత్యున్నత సైనిక పురస్కారమైన నిషాన్-ఏ-హైదర్‌తో సత్కరించాలని రాణా కొనియాడాడని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంభాషణలు రాణా-హెడ్లీ మధ్య జరిగినట్లు గుర్తించారు.

నిందితుడు డేవిడ్ హెడ్లీకి రాణా సహకరించాడని అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాణా అప్పగింత... 26/11 బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా ఒక ముందడుగు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాణా గురువారం నాడు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), యూఎస్ మార్షల్స్ సర్వీస్ అధికారులు అతన్ని లాస్ ఏంజిల్స్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చారు. రాణా రాకతో, ఎన్ఐఏ అధికారులు అతన్ని అరెస్టు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. విచారణ కోసం రాణాను 18 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.

లష్కరే తోయిబా, హర్కత్-ఉల్-జిహాదీ ఇస్లామీ (హుజీ) ఉగ్రవాద సంస్థలతో రాణా కుమ్మక్కై ముంబైలో దాడులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడుల్లో 166 మంది మరణించగా, 238 మందికి పైగా గాయపడ్డారు. లష్కరే, హుజీ సంస్థలను భారత ప్రభుత్వం ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది.

తహవ్వుర్ అప్పగింతపై హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ ఇది 26/11 దాడుల బాధితులకు న్యాయం చేకూర్చే దిశగా ఒక పెద్ద ముందడుగు అని అభివర్ణించారు. భారతదేశానికి ఇజ్రాయెల్ మాజీ రాయబారి మార్క్ సోఫర్ భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. రాణా విచారణలో ముంబై దాడుల వెనుక ఉన్న కుట్రలను వెలికితీయవచ్చని, ఇంకా ఎవరెవరికి సంబంధం ఉందో తెలుసుకోవచ్చని ఎన్ఐఏ భావిస్తోంది.
Go Back to Shorts
Tahawwur Hussain Rana
26/11 Mumbai Attacks
David Coleman Headley
Pakistan
Canada
India
NIA
Terrorism
Lashkar-e-Taiba
Extremism

More Telugu News