ముక్కోణపు వన్డే సిరీస్‌ కోసం భారత మహిళా జట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ

  • శ్రీలంక వేదికగా మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌
  • భారత్‌, శ్రీలంకతో పాటు ఈ సిరీస్‌లో ఆడనున్న‌ దక్షిణాఫ్రికా
  • ఏప్రిల్‌ 27న ప్రారంభం... మే 11న ఫైన‌ల్‌
శ్రీలంక వేదికగా జరుగనున్న ముక్కోణపు వన్డే సిరీస్‌ కోసం బీసీసీఐ భారత మహిళా జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ తో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ తిరిగి జట్టుతో చేరనుంది. జనవరిలో ఐర్లాండ్‌తో స్వ‌దేశంలో జరిగిన మూడు వ‌న్డేల‌ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. ట్రై సిరీస్‌కు బీసీసీఐ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధానను వైస్‌ కెప్టెన్‌గా నియ‌మించింది. 

కాగా, గాయాల కారణంగా పేస్ ద్వయం రేణుకా సింగ్ ఠాకూర్, టిటాస్ సాధును ఎంపిక చేయలేదు. కశ్వి గౌతమ్‌, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్‌కి జట్టులో చోటు దక్కింది. ఈ ముగ్గురు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవ‌డం విశేషం. అలాగే ఆల్ రౌండర్ స్నేహ్ రాణా, వికెట్ కీపర్-బ్యాటర్ యస్తికా భాటియా కూడా తిరిగి జట్టులోకి వచ్చారు.

ఇక ఈ ముక్కోణపు వన్డే సిరీస్‌ ఏప్రిల్‌ 27న ప్రారంభం కానుంది. మే 11న ఫైన‌ల్‌ జరుగుతుంది. భారత్‌, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా ఈ సిరీస్‌లో ఆడుతుంది. భారత జట్టు ఏప్రిల్ 27న శ్రీలంకతో తన తొలి మ్యాచ్ ఆడుతుంది. మూడు జట్లు ఒక్కొక్కటి నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నాయి. తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అన్ని మ్యాచులు కొలంబోలోని ఆర్‌ ప్రేమదాస స్టేడియంలోనే జరుగన్నాయి. 

ముక్కోణపు సిరీస్‌ కోసం భారత జట్టు...
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా (వికెట్ కీపర్), దీప్తి కౌర్, అమన్‌జోత్ కౌర్, కాశ్వి గౌతమ్‌, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, తేజల్ హసాబినీస్, శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ.

ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ ఇదే...
మొద‌టి వన్డే: శ్రీలంక vs భారత్, ఏప్రిల్ 27
రెండో వన్డే: భారతదేశం vs దక్షిణాఫ్రికా, ఏప్రిల్ 29
మూడో వన్డే: శ్రీలంక vs దక్షిణాఫ్రికా, మే 02
నాలుగో వన్డే: శ్రీలంక vs భారత్, మే 04
ఐదో వన్డే: దక్షిణాఫ్రికా vs భారత్, మే 07
ఆరో వన్డే: శ్రీలంక vs దక్షిణాఫ్రికా, మే 09
ఫైనల్: మే 11


More Telugu News