దోమలు ఇక మనపై వాలాలంటేనే భయపడతాయి.. శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం

  • మలేరియా దోమలకు నిటిసినోన్ ఔషధంతో చెక్
  • నిటిసినోన్‌ వాడే రోగులపై జరిపిన పరిశోధనలో పురోగతి
  • ఆ ఔషధం వాడే వ్యక్తుల రక్తం దోమలకు విషం
  • నిటిసినోన్‌ వల్ల మనుషులకు కానీ, పర్యావరణానికి కానీ ఎలాంటి ముప్పు లేదన్న శాస్త్రవేత్తలు
దోమలు వివిధ రకాల వ్యాధులను వ్యాప్తి చేస్తూ లక్షలాది మంది ప్రాణాలను హరిస్తున్నాయి. అవి ఎక్కడో ఒక చోట కాకుండా ప్రతి ప్రదేశంలోనూ ఉంటూ మనుషుల రక్తాన్ని పీలుస్తున్నాయి. అయితే, ఇకపై దోమలు మన దరి చేరాలన్నా, మన రక్తం తాగాలన్నా భయపడేలా శాస్త్రవేత్తలు ఒక సరికొత్త అస్త్రాన్ని అభివృద్ధి చేశారు. మలేరియా దోమలకు మన రక్తంతోనే చెక్ పెట్టే ఒక విధానాన్ని కనుగొన్నారు. మలేరియా వ్యాధికి కారణమైన దోమలకు మనుషుల రక్తాన్ని విషంగా మార్చే విషయంలో వారు ముందడుగు వేశారు. నిటిసినోన్ అనే ఔషధాన్ని మన రక్తంలోకి ఎక్కించడం ద్వారా, ఆ రక్తం దోమలకు విషంగా మారుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది.

నిటిసినోన్ సాధారణంగా అరుదైన జన్యుపరమైన వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ ఔషధం దోమలకు ప్రాణాంతకంగా మారుతుందని పరిశోధనలో తేలింది. ఈ ఔషధాన్ని వాడుతున్న రోగులపై జరిపిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. నిటిసినోన్ రోగుల జీవక్రియలకు సహకరిస్తూనే, వారి రక్తాన్ని తాగిన దోమల జీవక్రియకు మాత్రం విఘాతం కలిగిస్తుందని, ఫలితంగా ఆ దోమలు 12 గంటల్లోనే మరణిస్తున్నాయని గుర్తించారు. నిటిసినోన్ చాలా కాలం పాటు ప్రభావవంతంగా ఉంటుందని, దీని వల్ల మనుషులకు, పర్యావరణానికి ఎటువంటి హాని లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 


More Telugu News