ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియా... ఫైనల్లో కివీస్ మటాష్

India clinches ICC Champions Trophy 2025 by beating New Zealand in the final
  • 4 వికెట్ల తేడాతో ఇండియా విన్
  • 252 పరుగుల టార్గెట్ ను 49 ఓవర్లలో కొట్టేసిన రోహిత్ సేన
  • రాణించిన హిట్ మ్యాన్... కీలక ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్
రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఇవాళ  దుబాయ్ లో న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. 

కోహ్లీ తప్ప మిగతా ప్రధాన బ్యాటర్లందరూ రాణించిన వేళ... 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్ గా నిలిచింది. చివర్లో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ గా బౌండరీ కొట్టడంతో టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూం నుంచి మైదానంలోకి పరుగులు తీశారు. 

ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటను కూడా తక్కువ చేయలేం. ఆ జట్టు సాధించింది 251 పరుగులే అయినప్పటికీ, ఆ స్కోరును కాపాడుకునేందుకు చివరి వరకు పట్టువిడవకుండా పోరాడింది. అయితే, భారత బ్యాట్స్ మెన్ పట్టుదల ముందు కివీస్ ఎత్తుగడలు పనిచేయలేదు. 

టీమిండియా ఇన్నింగ్స్ చూస్తే... కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి ఇన్నింగ్స్ నడిపించాడు. హిట్ మ్యాన్ 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 76 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ 31 పరుగులు చేయగా... మాంచి ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరుగులు చేశాడు. 

అక్షర్ పటేల్ 29, కేఎల్ రాహుల్ 34 (నాటౌట్), జడేజా 9 (నాటౌట్) తలో చేయి వేసి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చారు. కివీస్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 2, మైకేల్ బ్రేస్వెల్ 2, కైల్ జేమీసన్ 1, రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు. 

కాగా, ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అంతేకాదు, టోర్నీలో ఒక్కసారి కూడా టాస్ గెలవకుండానే ఏకంగా టైటిల్ నెగ్గడం విశేషం.
Go Back to Shorts
India
ICC Champions Trophy 2025
Winner
New Zealand
Final
Dubai

More Telugu News