బెదిరించడం, భయపెట్టడం వంటివి మీకు అలవాటు.. మాకు కాదు: మంత్రి నారా లోకేశ్‌

  • ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలపై మంత్రి లోకేశ్‌ కౌంటర్
  • అనవసరమైన ఆరోపణలు వద్ద‌న్న మంత్రి 
  • వీసీలను బెదిరించామని నిరూపించాలంటూ స‌వాల్
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు రెండో రోజు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా 19మంది వైస్ చాన్సలర్లలో ఒకేసారి 17 మందిని బలవంతంగా రాజీనామా చేయించారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించామని ఆధారాలు ఇవ్వాల‌ని కోరారు. ఆధారాలు ఇస్తే ఇప్పుడే విచారణకు ఆదేశిస్తాన‌న్నారు. అనవసరమైన ఆరోపణలు చేయడం కాదు, ఆరోపణలు నిరూపించాలని మంత్రి లోకేశ్‌ సవాల్ విసిరారు. 

వైస్ చాన్సలర్లను మేం బెదిరించడం ఏమిటి? గవర్నర్ ఆధ్వర్యంలో యూనివర్సిటీలు నడుస్తాయ‌ని, ఎవరు బెదిరించారో చెప్పమనండి అంటూ మంత్రి మండిప‌డ్డారు. గతంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ ను రూమ్ లోకి వెళ్లకుండా తాళం వేసిన‌ మీరా మాట్లాడేది? అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. మీ వ్యాఖ్యలను వెంట‌నే ఉపసంహరించుకోవాల‌ని తెలిపారు. వీసీలు తప్పుచేశారు కనుకే రాజీనామా చేసి వెళ్లిపోయార‌ని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. 

వీసీ పదవుల కోసం 500 మంది దరఖాస్తు చేశార‌ని, గత ప్రభుత్వం మాదిరి ఆ పోస్టులను ఒకే వర్గానికి కట్టుబట్టలేదన్నారు. సామాజిక న్యాయం చేశామ‌ని, విద్యావేత్తలను వీసీలుగా నియమించిన‌ట్లు తెలిపారు. గతంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ రూమ్ కి తాళాలు వేశారు. బెదిరించడం, భయపెట్టడం, బయటకు పంపడం మీ అలవాటు అని దుయ్య‌బ‌ట్టారు. 

ముఖ్యమంత్రి సభలకు మీలా మేం స్కూలు పిల్లలను పంపలేదని మంత్రి లోకేశ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. పరదాలు కట్టుకొని తిరగడం, తీర్పులు చెప్పిన జడ్జిల భార్యలపై పోస్టులు పెట్టడం మీ వాళ్లకు అలవాటు, ఈ కేసులో ఇప్పటికే కొందరు జైలులో ఉన్నారని మంత్రి లోకేశ్‌ చెప్పారు.

Nara Lokesh
Andhra Pradesh
Assembly Sessions
YSRCP
TDP

More Telugu News