Ayyanna Patrudu: సాక్షి పత్రిక కథనంపై విచారణకు ఆదేశించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఎమ్మెల్యేల శిక్షణా తరగతులపై సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. సాక్షి మీడియాపై విచారణ జరిపేందుకు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తున్నట్టు అయ్యన్న తెలిపారు. సభా హక్కుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. 

చట్ట సభలపై కూడా గౌరవం లేకుండా సాక్షి మీడియాలో కథనాలు వస్తుండటం బాధాకరమని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారంటూ సాక్షిలో వచ్చిన కథనాల పేపర్ కటింగులను అసెంబ్లీలో స్పీకర్ ప్రదర్శించారు. సాక్షిలో వచ్చిన కథనాల విషయాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు. 

దీనిపై స్పీకర్ స్పందిస్తూ... ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించలేదని... జరగని శిక్షణా తరగతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని సాక్షిలో రాశారని మండిపడ్డారు. లోక్ సభ స్పీకర్, ఏపీ స్పీకర్ పై కథనాలు రాశారని చెప్పారు. ఇలాంటి తప్పుడు రాతలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని... ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తున్నానని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా సాక్షిపై తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. 
Ayyanna Patrudu
Telugudesam
Sakshi

More Telugu News