బానిస మనస్తత్వాలు... కుంభమేళా విమర్శకులపై మోదీ ఫైర్
- మహా కుంభమేళాపై విపక్షాల విమర్శలు
- విదేశీ మద్దతు ఉన్నవాళ్లు మన నమ్మకాలను తప్పుబడుతున్నారన్న మోదీ
- కుంభమేళా ఐక్యతా చిహ్నంగా భావితరాలకు స్ఫూర్తినిస్తుందని వెల్లడి
విదేశీ మద్దతు ఉన్న కొందరు నేతలు హిందూ మతాన్ని వెక్కిరిస్తుంటారని, తప్పుబడుతుంటారని... దేశాన్ని బలహీనపర్చేందుకు ప్రయత్నిస్తుంటారని మోదీ ధ్వజమెత్తారు. ప్రజల మధ్య చీలికలు తీసుకురావడమే వారి పని... మన దేశాన్ని కుంగదీసేందుకు అనేక విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయంటే... ఇలాంటి వారు అండగా ఉండడం వల్లే అంటూ మోదీ విమర్శించారు.
మహా కుంభమేళా వంటి భారీ కార్యక్రమం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేయడంలో ఆశ్చర్యమేమీ లేదని... ఐక్యతా చిహ్నంగా భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మోదీ వివరించారు.
మధ్యప్రదేశ్ లోని భాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.