ఈడీ అధికారులపై దర్శకుడు శంకర్ ఆగ్రహం
- 'రోబో' సినిమాకు సంబంధించి కాపీరైట్ ఉల్లంఘన కేసు
- శంకర్ కు చెందిన రూ. 10 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్ మెంట్
- హైకోర్టు తీర్పును ఈడీ విశ్వసించలేదని వ్యాఖ్య
ఈడీ తీసుకున్న చర్యలను ఉద్దేశించి పలు విషయాలను ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానని శంకర్ తెలిపారు. 'రోబో' సినిమాకు సంబంధించి నిరాధారమైన ఆరోపణలను చూపించి తనకు చెందిన మూడు స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్ చేశారని చెప్పారు.
'రోబో' కథకు సంబంధించి ఆరూర్ తమిళ్ నాడాన్ వేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చిందని... ఆ తీర్పును విశ్వసించకుండా, కేవలం ఫిర్యాదు ఆధారంగా ఈడీ తన ఆస్తులను జప్తు చేసిందని అన్నారు. ఈడీ చర్య న్యాయపరమైన వాస్తవాలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. ఆస్తుల అటాచ్ మెంట్ ను సవాల్ చేస్తూ అప్పీల్ కు వెళతానని చెప్పారు. ఈడీ అధికారులు తమ చర్యలపై పునఃసమీక్ష జరుపుతారని భావిస్తున్నానని శంకర్ తెలిపారు.