అభిషేక్ శర్మ వీరకొట్టుడు... టీమిండియా ఈజీ విన్

  • టీమిండియా-ఇంగ్లండ్ మొదటి టీ20
  • 7 వికెట్లతో టీమిండియా ఘనవిజయం
  • 133 పరుగుల టార్గెట్ ను 12.5 ఓవర్లలో కొట్టేసిన టీమిండియా
  • 34 బంతుల్లో 79 పరుగుల చేసిన అభిషేక్ శర్మ 
ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా గెలుపు బోణీ కొట్టింది. ఇంగ్లండ్ తో తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. 133 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 12.5 ఓవర్లలో 3 వికెట్లకు ఛేదించింది. 

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చిచ్చరపిడుగులా చెలరేగి 34 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్, అదిల్ రషీద్ వంటి సీనియర్ బౌలర్లతో కూడిన ఇంగ్లండ్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొన్న అభిషేక్ శర్మ... తన మెరుపు ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సులు కొట్టాడు. 

మరో ఓపెనర్ సంజు శాంసన్ 26 పరుగులు చేశాడు. చివర్లో అభిషేక్ శర్మ అవుటైనా... తిలక్ వర్మ (19 నాటౌట్), హార్దిక్ పాండ్యా (3 నాటౌట్) మిగతా పని పూర్తి చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు, అదిల్ రషీద్ 1 వికెట్ తీశారు. 

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు సరిగ్గా 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జనవరి 25న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.


More Telugu News