కోడిపందాల బరి వద్ద జనసేన ఫ్లెక్సీ... నేతను సస్పెండ్ చేసిన పార్టీ హైకమాండ్

  • పార్టీ గీత దాటిన జనసేన నేత
  • కంకిపాడులో కోడిపందాల బరి వద్ద జనసేన ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు
  • ముప్పా గోపాలకృష్ణ (రాజా)ను సస్పెండ్ చేసిన జనసేన పార్టీ
పార్టీ గీత దాటిన ఓ నేతపై జనసేన హైకమాండ్ చర్యలు తీసుకుంది. ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు వద్ద కోడిపందాలు నిర్వహించారు. అయితే, ఈ కోడిపందాల బరి వద్ద పెనమలూరు నియోజకవర్గ జనసేన నేత ముప్పా గోపాలకృష్ణ (రాజా) పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీన్ని పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. 

ముప్పా గోపాలకృష్ణను క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తున్నట్టు నేడు ఓ ప్రకటన విడుదల చేసింది. కోడి పందాల బరుల వద్ద ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం జనసేన పార్టీ విధానాలకు, ప్రతిష్ఠకు భంగకరం. ఇందుకు బాధ్యులైన మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాలతో మీకు ఎటువంటి అధికారిక సంబంధం లేదు అని ముప్పా గోపాలకృష్ణకు స్పష్టం చేశారు. ముప్పా గోపాలకృష్ణ పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Suspension
Muppa Gopalakrishna
Janasena
Penamaluru
NTR District

More Telugu News