ఆశారాం బాపుకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court grants interim bail to Asaram Bapu
  • జీవితఖైదు అనుభవిస్తున్న ఆశారాం బాపు
  • మార్చి 31 వరకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  • తన అనుచరులను కలవకూడదని సుప్రీంకోర్టు షరతు
అత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న వివాదాస్పద స్వామీజీ ఆశారాం బాపుకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటను కల్పించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మార్చి 31 వరకు బెయిల్ ఇచ్చింది. బెయిల్ పై విడుదలైన తర్వాత తన అనుచరులను కలవకూడదని ఆయనకు షరతు విధించింది. ఇదే సమయంలో పోలీసులకు కూడా కండిషన్స్ పెట్టింది. ఆశారాం బాపు ఆసుపత్రికి వెళ్లేటప్పుడు భద్రత కల్పించాలే తప్ప... ఆయన ఎక్కడకు వెళ్లాలో పోలీసులు నిర్దేశించకూడదని ఆదేశించింది. 

గుజరాత్ లోని మోతేరాలో ఆశారాం బాపూ ఆశ్రమంలో తాను పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు అత్యాచారం చేశారంటూ సూరత్ కు చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2001 నుంచి 2006 మధ్య తనపై ఎన్నోసార్లు అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాం బాపుతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 

గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఆశారాంను దోషిగా తేల్చింది. మిగిలిన వారికి సంబంధించి సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఆ తర్వాత ఆశారాంకు జీవితఖైదు విధించింది. 16 ఏళ్ల బాలికపై జోధ్ పూర్ ఆశ్రమంలో అత్యాచారం కేసులో కూడా ఆశారాం దోషిగా తేలారు. ఈ కేసులో కూడా ఆశారాంకు జీవితఖైదు పడింది.
Go Back to Shorts
asaram bapu
Supreme Court

More Telugu News