NItish Kumar Reddy: నితీశ్... నువ్వు సాధించబోయే అనేక సెంచరీలకు ఇది నాంది: వీవీఎస్ లక్ష్మణ్

తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో టీమిండియా కష్టాల్లో ఉన్న వేళ గట్టి పట్టుదల కనబర్చిన నితీశ్ కుమార్ రెడ్డి... అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. భారత క్రికెట్ కు మరో ఆశాకిరణం అనదగ్గ రీతిలో ఇవాళ నితీశ్ బ్యాటింగ్ సాగింది. 176 బంతులు ఎదుర్కొన్న ఈ స్టయిలిష్ రైట్ హ్యాండర్ 105 పరుగులతో అజేయంగా బరిలో ఉన్నాడు. ఈ క్రమంలో 10 ఫోర్లు, 1 సిక్సు బాదాడు. 

ఆస్ట్రేలియా గడ్డపై నితీశ్ సాధించిన ఘనత పట్ల భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. డియర్ నితీశ్... ఎంత అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు అని అభినందించాడు.

"జట్టు కష్టాల్లో ఉన్న వేళ అమోఘమైన ఆటతీరుతో ఆకట్టుకున్నావు. ఆస్ట్రేలియాలో టెస్టు సెంచరీ సాధించిన పిన్న వయస్కులైన భారత క్రికెటర్లలో నువ్వు మూడోవాడివి. నేను కచ్చితంగా చెప్పగలను... నువ్వు సాధించబోయే అనేక సెంచరీలకు ఇవాళ్టి శతకమే నాంది. భయం అనేది లేకుండా నువ్వు ఆడిన స్ట్రోక్ ప్లే, నీ సానుకూల దృక్పథాన్ని ఎంతో ఆస్వాదించాను. ఇక ముందు కూడా ఇలాగే ఆడాలి. దేవుడి ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి" అంటూ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.
NItish Kumar Reddy
Century
VVS Laxman
MCG
Team India
Australia

More Telugu News