K Raghavendra Rao: తెరపైకి డబ్బులు విసరడం నా సినిమాతోనే మొదలైంది: రాఘవేంద్రరావు

రాఘవేంద్రరావు .. తెలుగు సినిమాకి గ్లామర్ అద్దిన దర్శకులు. తెలుగు పాటకు పడుచుదనం తెచ్చిన దర్శకులు. అలాంటి ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. తాజాగా 'సిగ్నేచర్ స్టూడియోస్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా నా ప్రయాణం అన్నగారి 'పాండవ వనవాసం' సినిమాతో మొదలైంది. ఆ సినిమాకి క్లాప్ కొట్టిన నేను, ఆ తరువాత కాలంలో ఆయనతో వరుస సినిమాలు చేస్తానని ఊహించలేదు" అని అన్నారు. 

'అడవి రాముడు' సినిమాకి అన్నగారు నన్ను దర్శకుడిగా ఒప్పుకోవడమే నా అదృష్టం. ఎన్టీఆర్ ఏనుగుపై ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అనుకున్నాను. అలాంటి ఎంట్రీ కోసమే ఫారెస్టు నేపథ్యంలో ఆ కథను తయారు చేసుకోవడం జరిగింది. సాధారణంగా రామారావుగారు అవుట్ డోర్ కి వెళ్లేవారు కాదు. కానీ ఈ సినిమా కోసం ఆయన వరుసగా 38 రోజులు 'ముదుమలై' ఫారెస్టులో చేశారు. నిజంగా అది ఒక విశేషంగానే చెప్పుకోవాలి" అని అన్నారు. 

"అప్పటివరకూ అన్నగారికి ఉన్న ఇమేజ్ వేరు. అందువలన ఆయనతో స్టెప్పులు వేయించి, కొత్త కోణాన్ని చూపించాలని అనుకున్నాను. 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' సాంగ్ చేశాము. అప్పటివరకూ అన్నగారు తెరపై కనిపిస్తే అభిమానులు పూలు చల్లడం ఉండేది. కానీ ఈ పాటకి డబ్బులు విసిరారు. తెరపైకి డబ్బులు చల్లడం అనేది ఈ సినిమాతోనే మొదలైంది. ఆ సినిమా హిట్ తో నాపై అన్నగారికి నమ్మకం పెరగడం, వరుస హిట్లతో దానిని నేను నిలబెట్టుకోవడం జరిగాయి. నా సినీ జీవితానికి ఆయన బంగారు బాట వేశారు" అని చెప్పారు.
K Raghavendra Rao
NT Rama Rao
Adavi Ramudu Movie

More Telugu News