EVM Tampering: ఈవీఎంను హ్యాక్ చేయగలనన్న వ్యక్తి... ఈసీ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు

భారత్ లో గత కొంతకాలంగా ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఈవీఎం ఫలితాలను తారుమారు చేస్తున్నారంటూ పలువురు నేతలు బాహాటంగా ఆక్రోశిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, సయ్యద్ షుజా అనే వ్యక్తి తాను ఈవీఎంలను హ్యాక్ చేసి చూపిస్తానంటూ ప్రకటించాడు. ఈవీఎం ఫ్రీక్వెన్సీని ఐసోలేట్ చేయడం ద్వారా ఫలితాలను మార్చవచ్చని చెప్పాడు. దీన్ని సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఫిర్యాదును స్వీకరించిన ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), ఐటీ చట్టం కింద నవంబరు 30న కేసు నమోదు చేశారు. 

ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించిన ఏ ఈవీఎంను అయినా తాను హ్యాక్ చేయగలనని సయ్యద్ షుజా చెబుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కాగా, షుజా ఇవే ఆరోపణలను 2019 ఎన్నికల సమయంలోనూ చేశాడని అధికారులు నిర్ధారించారు. ఈ విషయమై అతడిపై ఢిల్లీలోనూ ఎఫ్ఐఆర్ నమోదైంది.
EVM Tampering
Syed Shuja
FIR
EC
Mumbai

More Telugu News