టీజీపీఎస్‌సీ కొత్త ఛైర్మ‌న్‌గా బుర్రా వెంక‌టేశం

Burra Venkatesham Appointed as a New Chairman of TGPSC
  • బుర్రా వెంక‌టేశం నియామకాన్ని ఆమోదించిన‌ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
  • 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన బుర్రా వెంక‌టేశం
  • రాజ్‌భవన్ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా విధులు 
  • డిసెంబర్ 3తో ముగియనున్న ప్రస్తుత ఛైర్మ‌న్‌ ఎం. మహేందర్ రెడ్డి పదవీ కాలం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ నియామకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం ఆమోదించారు. ప్రస్తుత ఛైర్మ‌న్‌ ఎం. మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనుంది. అందుకే కొత్త ఛైర్మ‌న్ నియామకానికి ప్రభుత్వం ఇటీవ‌ల నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 45 ద‌ర‌ఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వారిలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, వివిధ వర్సిటీల ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. చివ‌రికి బుర్రా వెంకటేశం పేరును సీఎం ఎంపిక చేసి, నియామక ఫైల్‌ను గవర్నర్‌కు పంపగా ఆయన ఆమోదించారు.

ఇక బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్ 10న తెలంగాణలోని జనగామ జిల్లాలో జన్మించారు. 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన... రాజ్‌భవన్ సెక్రటరీ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప‌ని చేశారు. 

ఆయ‌న‌ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గురుకులాల్లో చ‌దువుకున్న విద్యార్థులు క‌లెక్ట‌ర్ అయ్యారంటూ బుర్రా వెంకటేశం గురించి పలు వేదికలపై ప్రస్తావించారు.
Go Back to Shorts
Burra Venkatesham
TGPSC
Telangana

More Telugu News