Narendra Modi: మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయంపై ప్రధాని మోదీ స్పందన

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘనవిజయం సాధించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా... మ్యాజిక్ ఫిగర్ 145. మ్యాజిక్ ఫిగర్ ను ఎప్పుడో దాటేసిన మహాయుతి కూటమి (బీజేపీ-శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం) 232 స్థానాల్లో విజయం ఖాయం చేసుకుంది. విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి 52 స్థానాల్లో ముందంజ వేసింది. 

ఈ నేపథ్యంలో, మహాయుతి కూటమి విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక విజయం అందించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ఓటర్లు, మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని వెల్లడించారు.

ఐక్యంగా ఉండడం వల్ల మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కూటమి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

ఇక, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా ప్రధాని స్పందించారు. ఝార్ఖండ్ లో అధికార జేఎంఎం కూటమి విజయం సాధించినందుకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అయితే, విపక్షంగా ప్రజల సమస్యలను లేవనెత్తడంలో, రాష్ట్రం కోసం పనిచేయడంలో ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.
Narendra Modi
Maha Polls
Mahayuti Alliance
Maharashtra
Jhaskhand
Assembly Elections

More Telugu News