ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించిన లగచర్ల రైతులు
- తమపై ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు దాడి చేశారని ఫిర్యాదు
- ఫార్మా కంపెనీకి భూమిలిచ్చే ప్రసక్తి లేదని వెల్లడి
- గ్రామస్థులపై దాడి చేసి జైలుకు పంపించారని ఫిర్యాదు
ఫార్మా కంపెనీకి తాము భూములు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. భూములు ఇవ్వబోమంటూ తాము తొమ్మిది నెలలుగా ధర్నా చేస్తున్నామని, కానీ పట్టించుకున్న వారు లేరన్నారు. పోలీసులు గ్రామస్థులపై దాడి చేసి జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడిచిపెట్టి తమకు న్యాయం చేయాలని కోరారు.
లగచర్లలో ఫార్మా పరిశ్రమ వద్దన్న రైతులను పోలీసులు అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్రభుత్వం గిరిజనుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. గిరిజనులు భూమిని నమ్ముకొని జీవనోపాధిని పొందుతున్నారన్నారు. అలాంటి గిరిజనుల భూమిని ఫార్మా కంపెనీకి కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
గిరిజనులపై దౌర్జన్యం చేసి సంతకాలు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటిని సహించలేక కొంతమంది తిరగబడ్డారని, దీంతో అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ను తొలగించి ఇళ్లలోకి జొరబడి మరీ గిరిజనులను కొట్టారని ఆరోపించారు. ఈ దాడులకు భయపడి చాలామంది గిరిజనులు అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. గిరిజనులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తాము రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరామని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.
జాతీయ ఎస్టీ కమిషన్కు కాంగ్రెస్ నేతల వినతిపత్రం
లగచర్ల ఘటనపై కాంగ్రెస్ నేతలు జాతీయ ఎస్టీ కమిషన్కు ఓ వినతి పత్రం అందించారు. ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్, తదితరులు కమిషన్ సభ్యుడికి వినతిపత్రం అందించారు.