Mallu Bhatti Vikramarka: నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు: డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

Praja Vijayothsavalu in Telangana from Nov 14 to December 9
  • ప్రజా విజయోత్సవాలపై భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
  • విధివిధానాల రూపకల్పనకు సమావేశం
  • ప్రజా విజయోత్సవాలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసిన సబ్ కమిటీ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా విజయోత్సవాల నిర్వహణపై భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ప్రజా విజయోత్సవాలు ఏ విధంగా జరపాలి? ఏ అంశాలపై ప్రచారం చేయాలి? అనే దానిపై విధివిధానాలను రూపొందించేందుకు సమావేశమయ్యారు.

ఈ సబ్ కమిటీ ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. దివంగత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున ప్రజా విజయోత్సవాలు ప్రారంభించి... పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వరకు నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించింది. విజయోత్సవాల్లో భాగంగా భారీగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ 25 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలతో పాటు పలు కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ నుంచి గ్రామస్థాయి వరకు ఈ సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Mallu Bhatti Vikramarka
Congress
Telangana

More Telugu News