Revanth Reddy: మూసీ నది పునరుజ్జీవ పనులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

మూసీ నది పునరుజ్జీవ పనులకు ముహూర్తం ఖరారైంది. మూసీ పునరుజ్జీవ పనులపై తమ ప్రభుత్వం ముందుకే వెళుతుంది తప్ప వెనక్కి తగ్గేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. నవంబర్ 1వ తేదీన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.

మొదట బాపూఘాట్ నుంచి పనులను ప్రారంభిస్తామన్నారు. నవంబర్ లోపు టెండర్లు పిలుస్తామని, మూసీ పునరుజ్జీవంపై ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని, వారితో చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే బీఆర్ఎస్ నేతలు చెప్పవచ్చని సూచించారు. తనను కలవడానికి అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి చెప్పాలన్నారు.

బాపూ ఘాట్ నుంచి వెనక్కి 21 కిలోమీటర్లు అభివృద్ధి చేసి, మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలిస్తామని వెల్లడించారు. ఈ నీటి తరలింపునకు నవంబర్‌లో టెండర్లు పిలుస్తామన్నారు. మూసీ పునరుజ్జీవంపై తాను కావాలనే చర్చకు తెరలేపానని, ప్రజలకు అవగాహన కలిగిందన్నారు. మూసీ పునరుజ్జీవంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Revanth Reddy
Congress
Telangana
Musi River

More Telugu News