బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారు?: హరీశ్ రావు

తమ పార్టీకి చెందిన మహేందర్ రెడ్డికి శాసనమండలి చీఫ్ విప్ పదవిని ఎలా ఇచ్చారు? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు విప్ పదవిని కట్టబెట్టడమేమిటని నిలదీశారు.

రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘ‌న జ‌రుగుతోంద‌ని చెప్పేందుకు ఇదే ఉదాహ‌ర‌ణ అన్నారు. పీఏసీ చైర్మ‌న్ విష‌యంలో కూడా కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇలాగే వ్య‌వ‌హరించింద‌ని మండిపడ్డారు.

మహేందర్ రెడ్డిపై ఇప్పటికే అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉందని వెల్లడించారు. మండలి చీఫ్ విప్‌గా ఆయనను నియమిస్తూ చైర్మన్ ఇచ్చిన బులెటిన్ తమ అనర్హత పిటిషన్‌కు మరింత బలం చేకూర్చిందన్నారు. అనర్హత పిటిషన్‌లో దీనిని సాక్ష్యంగా చేరుస్తామని వెల్లడించారు.

ఆగస్ట్ 15న, సెప్టెంబర్ 17న ఎమ్మెల్సీ హోదాలోనే మహేందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారన్నారు. మార్చి 15 నుంచి ప్రభుత్వ విప్ అని బులెటిన్ ఇచ్చారని వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తాము లేఖ రాస్తామని, రాష్ట్ర గవర్నర్‌తో పాటు డీవోపీటీకి కూడా లేఖ రాస్తామన్నారు. గవర్నర్‌ను అధికార పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.

Harish Rao
Mahender Reddy
BRS
Congress

More Telugu News