ఇందులో దళితులను ఎందుకు లాగుతావ్ జగన్!: సీఎం చంద్రబాబు ఆగ్రహం

ఇవాళ తిరుమల వెళ్లాల్సిన మాజీ సీఎం జగన్ అనూహ్య రీతిలో పర్యటన రద్దు చేసుకోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. అంతేకాదు, పర్యటన రద్దు అనంతరం జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా కూటమి పార్టీల నేతల్లో ఆగ్రహావేశాలు కలిగించాయి. ఒక మాజీ సీఎంనే తిరుమల ఆలయంలోకి రానివ్వకపోతే, ఇక దళితుల పరిస్థితి ఏంటి? అని జగన్ వ్యాఖ్యానించారు. 

దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. నువ్వు తిరుమల గుడికి వెళ్లకుండా, ఇందులోకి దళితులను ఎందుకు లాగుతున్నావని జగన్ ను సూటిగా ప్రశ్నించారు. 

"దళితులను తిరుమల ఆలయంలోకి రానివ్వబోమని ఎవరు చెప్పారు? దళితులను ఆలయంలోకి అనుమతించడంలేదా? తిరుమల ఆలయానికి వెళ్లకుండా, కావాలనే ఇలా బురద చల్లుతున్నావు. ఈ విధంగా చేయడం ఇతడికి బాగా అలవాటైంది. ఇతనికి రాజకీయాల్లో విశ్వసనీయత లేదు. 

తిరుమల వెళ్లడం అతడికి ఇష్టం లేదు... వెళితే సంతకం పెట్టాలి... సంతకం పెట్టడం ఇష్టం లేదు... సంతకం పెట్టకుండా దౌర్జన్యం చేయాలి... కానీ ఇప్పుడు దౌర్జన్యం చేసే వీల్లేదు... కాబట్టి తిరుమల వెళ్లడం, వెళ్లకపోవడం అనేది మీ సమస్య. ఇందులోకి దళితులను ఎందుకు లాగుతున్నారు?" అని చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. 

"అతడు చెప్పేవన్నీ అబద్ధాలే. జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తే తనకు నోటీసులు ఇచ్చాడని చెబుతున్నాడు. నిన్ను తిరుమల వెళ్లవద్దని నోటీసులు ఇచ్చారా? నిన్ను వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లనివ్వబోమని ఎవరన్నా వచ్చి చెప్పారా? వీళ్లు ఇలాగే అబద్ధాలు చెబుతున్నప్పుడు మేం ఖండించకపోతే, వీళ్లు చెప్పే అబద్ధాలనే నిజం అనుకుంటారు" అని చంద్రబాబు పేర్కొన్నారు.

Chandrababu
Jagan
Tirumala
TDP-JanaSena-BJP Alliance
YSRCP
Andhra Pradesh

More Telugu News