విశాఖలో రజనీకాంత్ సినిమా షూటింగ్... స్పాట్ కు సమీపంలో అగ్ని ప్రమాదం

  • కూలీ చిత్రంలో నటిస్తున్న రజనీకాంత్
  • విశాఖలో కంటైనర్ టెర్మినల్ సమీపంలో చిత్రీకరణ
  • నౌక వద్ద చెలరేగిన మంటలు
  • కూలీ సెట్స్ పై ఆందోళన
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ' ప్రస్తుతం విశాఖపట్నంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 

ఇవాళ విశాఖ బీచ్ రోడ్డులోని కంటైనర్ టెర్మినల్ వద్ద చిత్రీకరణ జరుగుతుండగా... ఓ కార్గో షిప్ లిథియం అయాన్ బ్యాటరీల లోడుతో పోర్టు వద్దకు వచ్చింది. ఆ నౌక వద్ద మంటలు చెలరేగడంతో 'కూలీ' సెట్స్ పై ఆందోళన నెలకొంది. కంటైనర్ టెర్మినల్ కు చాలా దగ్గరగా షూటింగ్ జరుపుతుండడమే అందుకు కారణం.

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలను ఆరా తీస్తున్నారు. 

రజనీకాంత్ ప్రధాన పాత్రలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కూలీ' చిత్రంలో... టాలీవుడ్ కింగ్ నాగార్జున 'సైమన్' అనే పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే 'కూలీ' చిత్రం నుంచి నాగార్జున లుక్ విడుదల కాగా, రెస్పాన్స్ అదిరిపోయింది. 'కూలీ' చిత్రంలో శ్రుతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ తదితరులు నటిస్తున్నారు.

Fire Accident
Koolie
Rajinikanth
Visakhapatnam

More Telugu News