Andhra Pradesh: విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం చేసే గ్యాంగ్‌లు ఏపీలోనే ఎక్కువట!

Gangs who cheat in the name of jobs abroad are more in AP says Centre
షార్ట్స్‌లో చూడండి
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసి వేలాది రూపాయలను కాజేస్తున్న ఏజంట్లు, ముఠా సభ్యులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. అయితే ఏపీలోనే ఇటువంటి వాళ్లు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేసే ఏజెంట్లు, సంస్థల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఈ రకం మోసాలపై లోక్‌సభలో టీడీపీ సభ్యులు హరీష్ బాలయోగి, బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఏపీలో భారీగా మోసాలు జరుగుతున్నాయని, గత నాలుగేళ్లుగా ఇవి ఎక్కువగా నమోదు అయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ తరహా ఫిర్యాదులను ఏపీ పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకోలేదని వివరించింది. విదేశాలలో ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు కూడా ఈ నాలుగేళ్లలోనే ఎక్కువగా పెరిగారని తెలిపింది.

దేశ వ్యాప్తంగా 3,042 మంది నకిలీ ఏజెంట్లు ఉంటే వారిలో అత్యధికంగా 498 మంది ఒక్క ఏపీలోనే ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏపీ తర్వాత యూపీలో 418 మంది, తమిళనాడులో 372, మహారాష్ట్రలో 337, ఢిల్లీలో 299, పంజాబ్ లో 209, కేరళలో 206, తెలంగాణలో 123 మంది అక్రమ ఏజెంట్లు ఉన్నట్లు తెలిపింది. విదేశీ ఉద్యోగాల పేరుతో వచ్చిన ఫిర్యాదుల వివరాలు చూస్తే 2021లో 1553 నమోదు కాగా, 2022 లో 1227, 2023లో 1006 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది. 

ఈ ఏడాది జూన్ వరకూ 575 విదేశీ ఉద్యోగాల పేరుతో జరిగిన మోసాలపై ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పిన విదేశాంగ శాఖ .. ఏపీ నుండి 2021లో 1111, 2022లో 688, 2023లో 445, 2024లో 261 ఫిర్యాదులు అందినట్లు తెలిపింది. తమకు వచ్చిన ఫిర్యాదులను ఆయా రాష్ట్ర పోలీసులకు పంపి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించింది. ఈ ఫిర్యాదులపై అనేక రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ముమ్మరంగా చర్యలు తీసుకుంటుంటే ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని పేర్కొంది. గత నాలుగేళ్లుగా వచ్చిన ఫిర్యాదులపై ఏపీ పోలీస్ యంత్రాంగం ఇప్పటి వరకూ ఏలాంటి చర్యలు తీసుకోలేదని విదేశాంగ శాఖ వివరించింది.
Go Back to Shorts
Andhra Pradesh
Abroad Job Cheating
Central Government

More Telugu News