Uttam Kumar Reddy: ఆరోగ్యశ్రీపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Uttam Kumar Reddy key announcment on Arogyasree
షార్ట్స్‌లో చూడండి
తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇక నుంచి ఆరోగ్యశ్రీని అందుబాటులోకి తీసుకు వస్తామని, అర్హులైన వారందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు వేర్వేరుగా ఇస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ... గత పదేళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాకుండా డబ్బుల కోసం కట్టారని ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో అన్నీ తప్పుడు లెక్కలేనని, రూ.93 వేల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు.

పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల్లో కూడా అవినీతి జరిగిందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెచ్చిన అప్పులకు 20 వేల కోట్ల వడ్డీ కట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత ఘోరమైన తప్పిదమన్నారు. ఈ ప్రాజెక్టు తప్పిదమని కేంద్ర జలవనరుల సలహాదారు కూడా పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆధారాలతో వివరించారన్నారు. మేడిగడ్డ కాకుండా తుమ్మిడిహట్టి సరైన చోటు అని శ్రీరామ్ వెదిరే అఫిడవిట్ ఇచ్చినట్లు చెప్పారు.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్లకు నిజాలు నిగ్గు తేల్చాలని అప్పగించినట్లు చెప్పారు. బ్యారేజీ భవిష్యత్తు తేల్చాలని కోరామన్నారు. వారు కొన్ని మధ్యంతర సూచనలు చేశారని, ఆ సూచనలతో కాళేశ్వరం బ్యారేజీలో కొన్ని పనులు చేసినట్లు చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా తాను ఆలస్యంగా వచ్చానని, ఇక నుంచి ప్రతి నెల సమీక్షలు నిర్వహిస్తానన్నారు.

కాళేశ్వరంలో పంప్ చేసిన నీటి కంటే వదిలేసిన నీళ్లే ఎక్కువ అన్నారు. ఐదేళ్లలో కాళేశ్వరంలో 65 టీఎంసీల నీళ్లు మాత్రమే వాడినట్లు చెప్పారు. కాళేశ్వరానికి సంబంధించిన అన్ని పంపులు నడిస్తే ప్రతి ఏటా రూ.10 వేల కోట్ల విద్యుత్ ఖర్చు అవుతోందని తెలిపారు. ప్రజలపై ఇంత భారం మోపారు కాబట్టే వారిని ఇంటికి పంపించారన్నారు. తెలంగాణ రైతాంగం విషయంలో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలు కోరుతూ తీసుకున్న రుణమాఫీ నిర్ణయం గర్వకారణమన్నారు. బీఆర్ఎస్ ఎనిమిదేళ్లలో రూ.25 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తే, తాము ఈసారే రూ.31 వేల కోట్లు చేస్తున్నామన్నారు.
Go Back to Shorts
Uttam Kumar Reddy
Congress
Telangana

More Telugu News