Siblings reunited through instagram: 18 ఏళ్ల క్రితం దూరమైన సోదరుడు.. ఇన్‌స్టాలో విరిగిన పన్ను చూసి గుర్తుపట్టిన మహిళ

పద్దెనిమిదేళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిన సోదరుడు క్రమంగా ఆమెకు దూరమయ్యాడు. అది ఆమె జీవితంలో పెద్ద లోటునే మిగిల్చింది. ఇటీవల ఓ రోజు ఆమెకు ఇన్‌స్టాలో వీడియోలో ఓ యువకుడిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. అతడి విరిగిన పన్ను చూడగానే ఆమెకు తన సోదరుడు గుర్తొచ్చాడు. సందేహిస్తూనే ఆమె అతడిని సోషల్ మీడియా ద్వారా సంప్రదించింది. ఇద్దరూ చిన్ననాటి రోజులను గుర్తుతెచ్చుకున్నారు. చివరకు అతడు తన సోదరుడే అని తెలిసి ఆమె మురిసిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. 

జిల్లాలోని హథీపూర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమారి సోదరుడు బాల్ గోవింద్ చిన్నతనంలోనే పని కోసం ముంబై వెళ్లాడు. ఆ తరువాత స్నేహితులకు దూరంగా మరో పనిలో కుదురుకున్నాడు. స్వగ్రామంలోని తన బంధువులు, కుటుంబసభ్యులతో నిత్యం టచ్‌లోనే ఉండేవాడు. ఆ తరువాత వారితో సంబంధాలు క్రమంగా బలహీనపడ్డాయి. అతడి స్నేహితులందరూ స్వగ్రామానికి తిరిగొచ్చేసినా బాల్ గోవింద్ మాత్రం ముంబైలోనే ఉండిపోయాడు. 

అయితే, ఓసారి స్వగ్రామనికి రైల్లో బయలుదేరిన అతడి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. రైల్లో అనారోగ్యం పాలైన అతడు చివరకు కాన్పూర్‌కు బదులు రాజస్థాన్‌లోని జైపూర్‌కు చేరుకున్నాడు. తను ఏ స్థితిలో ఎక్కడున్నాడో తనే గుర్తించలేని స్థితిలో పడ్డాడు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్‌లోని ఓ వ్యక్తి అతడికి అండగా నిలిచి ఓ ఫ్యాక్టరీలో జాబ్ ఇప్పించాడు. 

ఈ క్రమంలో గోవింద్ ఆరోగ్యం కూడా చక్కబడింది. అక్కడే అతడు ఈశ్వరీ దేవి అనే మహిళను పెళ్లాడి కొత్త జీవితం ప్రారంభించాడు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. జీవితం ఇంతలా మారినా అతడి విరిగిపన్నులో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. ఈలోపు అతడు ఇన్‌స్ట్రా గ్రామ్ వీడియోలు చేయడం మొదలెట్టాడు. వీటిల్లో ఒకటి అతడి సోదరి రాజ్‌కుమారి కంటపడటంతో మళ్లీ వారి కుటుంబం ఒక్కటైంది. సోదరిని గుర్తుపట్టి స్వగ్రామానికి చేరుకున్న బాల్ గోవింద్‌ను చూసి కుటుంబం మొత్తం సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది.
Siblings reunited through instagram
Broken tooth
viral News

More Telugu News