టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు
- ఏపీలో కొత్త ప్రభుత్వం
- టీటీడీ గత ఈవో ధర్మారెడ్డిని సాగనంపిన కూటమి సర్కారు
- కొత్త ఈవోగా జె.శ్యామలరావు నియామకం
- శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించిన మాజీ ఈవో ధర్మారెడ్డి
సంప్రదాయం ప్రకారం మొదట వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా వచ్చిన శ్యామలరావుకు టీటీడీ వర్గాలు స్వాగతం పలికాయి. మాజీ ఈవో ధర్మారెడ్డి... శ్యామలరావుకు బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ, ఎంతో పవిత్రతో కూడిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ పదవిని చేపట్టే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
తిరుమల వచ్చే భక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా స్వామి వారిని దర్శించుకుని తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు కల్పించడంపై దృష్టి సారిస్తామని శ్యామలరావు తెలిపారు. ఈవోగా బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.