ఫొటోలు, వీడియోలు మాత్రమే సాక్ష్యం కాబోవు.. ఢిల్లీ హైకోర్టు

Photos Are Not Evidence In The Age Of DeepFake
  • అవి నిజమైనవేననే ఆధారాలు కూడా ఇవ్వాల్సిందేనన్న కోర్టు
  • విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు
  • డీప్ ఫేక్ యుగంలో ఫొటోలను నమ్మలేమన్న జడ్జి
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ పెరిగిపోతోంది.. డీప్ ఫేక్ ఫొటోలే అసలైన ఫొటోలుగా చలామణి అవుతున్న రోజుల్లో ఫొటోలు, వీడియోలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కేవలం ఫొటోలు, వీడియోలు ఇస్తే సరిపోదు.. అవి నిజమైనవేననే ఆధారాలను కూడా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈమేరకు ఓ జంట విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీకి చెందిన ఓ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. భార్య, ఐదేళ్ల కూతురుకు కలిపి నెలనెలా రూ.75 వేలు భరణం కింద చెల్లించాలని భర్తను ఆదేశించింది.

అయితే, తన భార్యకు వివాహేతర సంబంధం ఉంది కాబట్టి తాను ఎలాంటి మనోవర్తి చెల్లించాల్సిన అవసరంలేదని భర్త వాదించారు. ఫ్యామిలీ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. భార్య వివాహేతర సంబంధానికి సాక్ష్యంగా ఫొటోలను కోర్టుకు సమర్పించాడు. ఈ కేసును జస్టిస్ రాజీవ్ షక్దర్, జస్టిస్ అమిత్ బన్సల్ ల ధర్మాసనం విచారించింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందంటూ భర్త సమర్పించిన ఫొటోలు స్పష్టంగా లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు, డీప్ ఫేక్ ఫొటోల బెడద నేపథ్యంలో ఆ ఫొటోలను సాక్ష్యంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. మరింత స్పష్టమైన ఫొటోలు, అవి నిజమైనవేననే ఆధారాలతో కోర్టుకు అందజేస్తే పరిశీలిస్తామని పేర్కొంది.
Go Back to Shorts
Deepfake
Photos
Delhi High Court
Evidence
Photo Evidence

More Telugu News