మరికొన్ని గంటల్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. కీలక ఆటగాడికి ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చిన పాక్

  • ఆల్‌రౌండర్ ఇమాద్ వాసిమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్
  • పవర్ హిట్టింగ్‌తో పాటు బౌలింగ్ చేయగల యువ సంచలనం
  • పలువురు ఆటగాళ్లు విఫలమవుతున్న నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో ఇమాద్‌కు చోటు దక్కే ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ 20254లో నేడు (ఆదివారం) హైవోల్టేజీ క్రికెట్ సమరం జరగనుంది. దాయాది దేశాలైన భారత్ -పాకిస్థాన్ న్యూయార్క్ వేదికగా తలపడనున్నాయి. రాత్రి 8 గంటలకు ప్రారంభంకానున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కాగా, భారత్‌తో మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్ వాసిమ్‌కు ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చింది. కుడి పక్కటెముక ఇబ్బంది కారణంగా అమెరికాతో మ్యాచ్‌కు దూరమైన అతడు ఫిట్‌నెస్ పరీక్షలో పాసయ్యాడని ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ వెల్లడించాడు. భారత్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో జట్టు ఎంపికకు ఇమాద్ వాసిమ్ అందుబాటులో ఉంటాడని నిర్ధారించాడు.

కాగా నేడు (ఆదివారం) భారత్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఇమాద్ వాసిమ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇమాద్ పవర్ హిట్టింగ్‌తో పాటు బౌలింగ్ చేయగలడు. దీంతో అతడి వైపు జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గుచూపే అవకాశం ఉంది. ఇటీవలే అమెరికా చేతిలో పాకిస్థాన్ దారుణ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ షాదాబ్ ఖాన్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ ఇబ్బంది పడ్డాడు. అమెరికా చేతిలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాక్ కెప్టెన్ బాబర్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. మరోవైపు, అమెరికా మ్యాచ్‌లో వికెట్ కీపర్ ఆజం ఖాన్ కూడా విఫలమయ్యాడు. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరిని పక్కనపెట్టి ఇమాద్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

T20 World Cup 2024
India vs Pakistan
Cricket
Imad Wasim

More Telugu News