Rahul Gandhi: కాంగ్రెస్ అభ్యర్థులతో రాహుల్ గాంధీ, ఖర్గే నేడు కీలక భేటీ

Rahul Gandhi and Mallikarjun Kharge to hold meeting to discuss June 4 preparations
షార్ట్స్‌లో చూడండి
లోక్‌సభ ఎన్నికలు-2024లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరోసారి అధికారంలోకి రాబోతోందని శనివారం సాయంత్రం వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారని విశ్లేషించాయి. అయితే ఎగ్జిట్స్ పోల్స్‌ను నమ్మాల్సిన అవసరం లేదని చెబుతున్న విపక్ష పార్టీలు జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ కోసం సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేడు (ఆదివారం) హస్తం పార్టీ అభ్యర్థులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఉదయం వర్చువల్‌గా జరగనున్న ఈ సమావేశంలో అభ్యర్థులతో కౌంటింగ్ రోజు సన్నద్దత, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. కౌంటింగ్‌ ప్రక్రియతో పాటు పలు అంశాలపై మాట్లాడనున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1 గంట సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఖర్గే, రాహుల్ వర్చువల్ మీటింగ్‌ నిర్వహించనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

ఈ వర్చువల్ మీటింగ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, ఇతర అగ్రనేతలు ఉండనున్నారని తెలుస్తోంది. కాగా శనివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ప్రతిపక్షాల ఇండియా కూటమి నేతలు ఇప్పటికే సమావేశమయ్యారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ-ఎం, సీపీఐ, డీఎంకే, జేఎంఎం, ఆప్, ఆర్‌జేడీ, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ(శరద్ పవార్) సహా పలు పార్టీల విపక్ష నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే టీఎంసీ, పీడీపీ ప్రతినిధులు ఈ భేటీకి గైర్హాజరయ్యారు.

2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఇలా..
మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా మెజారిటీ స్థానాలు ఎన్డీయే కూటమి గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఘంటాపథంగా చెప్పాయి. ఎన్డీయే కూటమి 371 నుంచి 401 స్థానాలు గెలుపొందవచ్చునని అంచనా వేశాయి. బీజేపీ ఒంటరిగా 319-338 సీట్లు గెలుస్తుందని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్‌ను ఎన్డీయే క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ అంచనా వేసింది. ఇక తెలంగాణలో బీజేపీకి అత్యధిక స్థానాలు రావొచ్చని లెక్కగట్టింది. ఈసారి దక్షిణాదిలో అనూహ్య స్థాయిలో ఎన్డీయే కూటమి సీట్లు సాధించబోతోందని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి.
Go Back to Shorts
Rahul Gandhi
Congress
Lok Sabha Polls
Mallikarjun Kharge

More Telugu News