ఇలా చేస్తే కౌంటింగ్ హాళ్లలో గందరగోళం నెలకొంటుంది: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగ్గా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, సీబీఐ మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. 

ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలు స్వతంత్ర అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల రూపంలో తమ పార్టీ కార్యకర్తలను  కౌంటింగ్ హాల్లోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 

ఏదో ఆషామాషీగా ఎన్నికల్లో నిలబడిన స్వతంత్ర అభ్యర్థులను గుర్తించి, వారి తరఫున తమ మనుషులను పంపించేలా ప్రధాన పార్టీలు ఎత్తుగడలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఇలా చేస్తే కౌంటింగ్ హాళ్లలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని, ఇబ్బందికర వాతావరణం నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. 

ఈ మేరకు ఆయన తన ట్వీట్ కు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేశారు.


More Telugu News