RBI: లండన్‌లో వేలానికి... 1918 నాటి అరుదైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూ.10 నోట్లు

Rare Indian Banknotes From 1918 Shipwreck To Be Auctioned In London
  • ముంబై నుంచి లండన్ వెళుతుండగా మునిగిన ఓడ
  • ఆ సమయంలో సముద్రంలో దొరికిన రెండు 10 రూపాయల నోట్లు
  • ఈ నోట్లను వేలం వేయనున్న నూనన్స్ మేఫెయిర్ 
  • ఈ నోట్లకు రూ.2000 నుంచి 2600 పౌండ్లు రావొచ్చునని అంచనా

1918లో ముంబై నుంచి లండన్‌కు వెళుతున్న ఓడ మునిగిపోగా... నీటిలో దొరికిన అరుదైన రెండు 10 రూపాయల నోట్లను వచ్చే బుధవారం వేలం వేయనున్నారు. లండన్‌లోని నూనన్స్ మేఫెయిర్ వేలం సంస్థ ఈ నోట్లను వేలం వేయనుంది. ఈ రెండు నోట్లు వేలం వేస్తే 2000 నుంచి 2600 పౌండ్ల ధర పలకవచ్చునని అంచనా వేస్తున్నారు.

జులై 2, 1918లో మునిగిపోయిన ఓడ శిథిలాల మధ్య ఈ పది రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు నూనన్స్ నిపుణురాలు థొమాసినా స్మిత్ తెలిపారు. ఈ నోట్లపై 25 మే 1918 తేదీని ముద్రించినట్టు వెల్లడించారు. వీటితో పాటు సంతకం చేయని అనేక 5 రూపాయలు, 10 రూపాయల నోట్లు, సంతకం చేసిన రూ.1 రూపాయి నోట్లను కూడా గుర్తించారన్నారు. ఇలా దొరికిన వాటిని అధికారులు చాలా వరకు స్వాధీనం చేసుకున్నారని... వాటిలో కొన్ని నాశనమయ్యాయని .. ఇంకొన్ని కొత్తగా ముద్రణకు వెళ్లాయన్నారు. ఆ నోట్లలో కొన్ని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి కూడా వెళ్లినట్లు తెలిపారు. ఇలాంటి నోట్లను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ఈ నోట్లు మంచి కండిషన్లో ఉన్నట్లు తెలిపారు. పైగా ఈ రెండు నోట్లు వరుస సంఖ్యలను కలిగి ఉండటం మరింత అద్భుతమన్నారు.

వచ్చే బుధవారం నోట్ల వేలంలో మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. బ్రిటిష్ కాలంలోని అరుదైన రూ.100 రూపాయల నోటును కూడా వేలం వేస్తున్నారు. దీని విలువ 4,400 నుంచి 5,000 పౌండ్ల వరకు పలకవచ్చునని భావిస్తున్నారు. ఈ 100 రూపాయల నోటు కలకత్తాలో ముద్రితమైంది. సంతకం, స్టాంప్ ఉన్నాయి. ఈ రూ.100 నోటు 1917-1930 కాలం నాటిది. నోటు వెనుక భాగాన హిందీ, బెంగాలీ భాషతో పాటు వివిధ భారతీయ భాషల్లో రూ.100 అని రాయబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-పర్షియన్ గల్ఫ్ ఇష్యూ చేసిన 1957-62 నాటి రూ.5 రూపాయల నోటును కూడా వేలం వేయనున్నారు. ఇది అశోక్ చిహ్నాన్ని కలిగి ఉంటుంది. దీని విలువ రూ.2,200 నుంచి రూ.2,800 వరకు పలకవచ్చునని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News