ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 25.41 శాతం పోలింగ్‌

25 percent Voter Turnout Recorded Across 11 States Union Territories Till 11 AM
  • దేశంలో కొన‌సాగుతున్న లోక్‌స‌భ‌ మూడో దశ పోలింగ్
  • ఈ మూడో ద‌శ‌లో 11 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్
  • అత్య‌ధికంగా ప‌శ్చిమ బెంగాల్‌లో 32.82 శాతం పోలింగ్ న‌మోదు
దేశంలో లోక్‌స‌భ‌ మూడో దశ పోలింగ్ కొన‌సాగుతోంది. ఈ మూడో ద‌శ‌లో 11 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జ‌రుగుతోంది. దీనిలో భాగంగా ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 25.41 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అత్య‌ధికంగా ప‌శ్చిమ బెంగాల్‌లో 32.82 శాతం పోలింగ్ న‌మోదు కాగా, అత్య‌ల్పంగా మ‌హారాష్ట్ర‌లో 18.18 శాతం న‌మోదైన‌ట్లు తెలిపారు. ప్రధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్‌, ఆయ‌న భార్య డింపుల్ యాద‌వ్‌, ఇత‌ర నేత‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.  

కాగా, 11 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కీలక దశలో 120 మంది మహిళలు సహా 1,300 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గుజరాత్‌లో 26, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 10, మధ్యప్రదేశ్‌లో 8, ఛత్తీస్‌గఢ్‌లో 7, బీహార్‌లో 5, అస్సాంలో 4, పశ్చిమ బెంగాల్‌లో 4, గోవాలో 2 స్థానాల్లో మూడో దశ పోలింగ్ జరగనుంది. అలాగే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యులో కూడా ఇవాళే పోలింగ్ జ‌రుగుతోంది.

ఇదిలాఉంటే.. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది.
Go Back to Shorts
Lok Sabha Polls
Third Phase
Uttar Pradesh
West Bengal
Maharashtra

More Telugu News