Anand Ranganathan: రాహుల్ గాంధీ కనుక టైటానిక్ షిప్ కెప్టెన్ అయ్యుంటే..: సైంటిస్ట్ ఆనంద్ రంగనాథన్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రముఖ రచయిత, సైంటిస్ట్ ఆనంద్ రంగనాథన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పతనానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీయేనని ఆరోపించారు. ఇప్పటికే వయనాడ్ లో మరోమారు పోటీ చేసిన రాహుల్.. అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పోటీపడగలడా అన్న ప్రశ్నకు జవాబిస్తూ.. అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయడం వల్ల స్మృతి ఇరానీకి పెద్దగా ఇబ్బంది ఉండదని తేల్చేశారు. నెహ్రూ గాంధీల కుటుంబానికి ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాలు ఇటీవలి కాలం వరకూ కంచుకోటగా ఉండేవని, కానీ ప్రస్తుతం అక్కడ కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయని వివరించారు.

సంవత్సరాల తరబడి వారి కుటుంబాన్ని అక్కడి ప్రజలు ఆదరించినా.. వారు మాత్రం తమ నియోజకవర్గాలను పట్టించుకోలేదని ఆరోపించారు. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఆ రెండు నియోజకవర్గాలు వెనుకబాటుకు గురయ్యాయని మండిపడ్డారు. దీంతో అమేథీ ప్రజలు మేలుకొని గత సార్వత్రిక ఎన్నికల్లో స్మృతి ఇరానీని గెలిపించారని గుర్తుచేశారు. టైటానిక్ షిప్ ప్రమాదవశాత్తూ మంచుకొండను ఢీ కొట్టి నీట మునిగిందని, అదే రాహుల్ గాంధీ కనుక ఆ షిప్ కెప్టెన్ అయ్యుంటే మంచుకొండను వెతుక్కుంటూ వెళ్లి మరీ షిప్ తో ఢీ కొట్టించే వాడంటూ ఆనంద్ రంగనాథన్ ఎద్దేవా చేశారు. ఇందుకోసం రాత్రంతా సముద్రంలో షిప్ ను తిప్పుతుండేవాడని ఆనంద్ విమర్శించారు.
Anand Ranganathan
Rahul Gandhi
Titanic Ship
Congress
Amethi
Raibareli
Lok Sabha Polls

More Telugu News