తరుణ్ రీ ఎంట్రీ త్వరలోనే ఉంటుంది: రోజా రమణి

Roja Ramani Interview
  • ఆర్టిస్టులకు గ్యాప్ రావడం సహజమన్న రోజారమణి 
  • తరుణ్ కి ఎక్కువ గ్యాప్ వచ్చిందని వ్యాఖ్య 
  • ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటున్నాడని వెల్లడి
  • రీ ఎంట్రీ సన్నాహాలు జరుగుతున్నాయని వివరణ  

'అంజలి' సినిమాతోనే బాలనటుడిగా అందరి దృష్టిలో పడిన తరుణ్, ఆ తరువాత 'నువ్వేకావాలి' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా నుంచి వరుస హిట్లతో దూసుకుపోయాడు. ఆ తరువాత ఆయనకి వరుస పరాజయాలు ఎదురవుతూ వచ్చాయి. దాంతో ఆయన సినిమాలకు దూరమవుతూ వచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని గురించి రోజా రమణి ప్రస్తావించారు. 

"నేను 600 సినిమాలకి డబ్బింగ్ చెప్పాను. అలాగే కెరియర్ మంచి జోరుమీద ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని సినిమాలను పక్కన పెట్టాను. ఆ తరువాత ఎప్పుడూ కూడా నేను తీసుకున్న నిర్ణయం నాకు పొరపాటుగా అనిపించలేదు. కానీ తరుణ్ కి గ్యాప్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఆలోచన చేశాను. ఆర్టిస్టులకు గ్యాప్ రావడం సహజం .. కాకపోతే తరుణ్ కి కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చిందంతే" అని అన్నారు. 

" మా ఫ్యామిలీకి కొన్ని బిజినెస్ లు ఉన్నాయి. ప్రస్తుతం తరుణ్ ఆ బిజినెస్ లు చూసుకుంటున్నాడు. ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరింత ఆర్ధిక భద్రత కోసం వేరే బిజినెస్ లు ఉండాలనేదే నా ఉద్దేశం. నా ఇద్దరు పిల్లలు కూడా చెప్పింది వినేవారే. ఒక మంచి సినిమాతో తన రీ ఎంట్రీ ఉండాలని భావిస్తున్నాడు .. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. త్వరలోనే తరుణ్ రీ ఎంట్రీ ఉంటుంది" అని చెప్పారు.
Go Back to Shorts
Roja Ramani
Actress
Tharun
Tollywood

More Telugu News