Pawan Kalyan: చంద్రబాబును జైల్లో పెట్టిన వ్యక్తి ఐదేళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు: పవన్ కల్యాణ్

  • పిఠాపురం మండలంలో పవన్ కల్యాణ్ రోడ్ షో
  • మూడు పార్టీల శ్రేణులతో పోటెత్తిన రోడ్ షో
  • టీడీపీ ఒక బలమైన పార్టీ అని పవన్ కితాబు
  • టీడీపీ శ్రేణుల బాధను అర్థం చేసుకుని జైల్లో చంద్రబాబును కలిశానని వెల్లడి
Pawan Kalyan slams CM Jagan

జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ పిఠాపురం మండలంలో రోడ్ షో నిర్వహించారు. చెందుర్తి జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షోకు విశేష స్పందన లభించింది. జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు పాల్గొనడంతో రోడ్ షో పోటెత్తిపోయింది. కుమారపురం వద్ద పవన్ రోడ్ షో ముగియనుంది. ఈ రోడ్ షోలో పవన్ తో పాటు పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా పాల్గొన్నారు. 

రోడ్ షోలో పవన్ మాట్లాడుతూ, నాడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణుల వేదన తనకు అర్థమైందని అన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు వారి బాధను నేరుగా తనతో పంచుకోకపోయినా... వారి మనసులో బాధను అర్థం చేసుకుని, నేరుగా రాజమండ్రి జైలు వద్దకు వెళ్లి చంద్రబాబుకు మద్దతు తెలిపానని వివరించారు. అందరూ భయపడుతున్న రోజుల్లో తాను వెళ్లి చంద్రబాబును కలిశానని గుర్తుచేశారు. 

"నాలుగు దశాబ్దాల పాటు పార్టీ నడిపిన వ్యక్తి, వర్మ గారి వంటి బలమైన నాయకులు ఉన్న పార్టీ, నాలుగు దశాబ్దాలుగా బలమైన కార్యకర్తలు, తెలుగు మహిళలు ఉన్న పార్టీ, రాష్ట్రానికి సేవలు చేసిన పార్టీ టీడీపీ. ప్రతి పార్టీ పాలనలో తప్పొప్పులు, విభేదాలు ఉంటాయి. 

అవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించుకోవాలి కానీ, చంద్రబాబు వంటి నాయకుడ్ని తీసుకెళ్లి 53 రోజులు జైల్లో కూర్చోబెట్టారు. పెట్టినోడు ఎవడు... ఐదు సంవత్సరాలుగా బెయిల్ మీదున్న వ్యక్తి! ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఐదేళ్లుగా బెయిల్ మీదున్నాడు. అతడిపై 30 కేసులు ఉన్నాయి. 

మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి, మద్యం ఏరులై పారిస్తున్నాడు. రూ.60 ఉండే క్వార్టర్ ఇప్పుడు రూ.200 పలుకుతోంది. రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాడు. అధికారంలోకి రాగానే ఈ విధానం మార్చేస్తాం. వచ్చేది కూటమి ప్రభుత్వమే. 

అడగనిదే అమ్మయినా పెట్టదంటారు... అందుకే టీడీపీ కార్యకర్తలను, జనసేన మద్దతుదారులను, బీజేపీ శ్రేణులను అడుగుతున్నా... నేను పిఠాపురం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను... నాకు మీ విలువైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించండి.

పిఠాపురంలో వర్మ గారి సహకారం మరువలేనిది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఇద్దరం కలిసి పరిష్కరిస్తాం. చంద్రబాబు గారు చెప్పారు... క్షత్రియ కోటాలో వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తామన్నారు... ఆ దిశగా నేను కూడా కృషి చేస్తాను" అని పవన్ కల్యాణ్ వివరించారు.

More Telugu News