Kannababu: పవన్ కల్యాణ్ అనే వ్యక్తి నన్ను పోషించినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు: కన్నబాబు

  • నిన్న కాకినాడ రూరల్ లో కన్నబాబుపై పవన్ కల్యాణ్ ఫైర్
  • చిరంజీవి పెట్టిన భిక్షతో రాజకీయ నేతగా ఎదిగాడని వ్యాఖ్యలు
  • జగన్... చిరంజీవిని అవమానిస్తుంటే సిగ్గనిపించలేదా? అంటూ ఆగ్రహం
  • చంద్రబాబు వలలో పడిన పవన్ గిలగిల్లాడుతున్నాడన్న కన్నబాబు
  • ఆ ఫ్రస్ట్రేషన్ తమపై చూపిస్తున్నాడని వెల్లడి
Kannababu reacts on Pawan Kalyan remarks

జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న రాత్రి కాకినాడ రూరల్ లో స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. చిరంజీవి పెట్టిన భిక్షతో కన్నబాబు రాజకీయ నేతగా ఎదిగారని, అలాంటి చిరంజీవిని జగన్ అవమానిస్తుంటే కన్నబాబుకు సిగ్గనిపించలేదా? ఏం బతుకు నీది? అంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కురసాల కన్నబాబు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు. 

"ఆయన నోటికొచ్చినట్టు తిట్టాడు. సంస్కారం అనేది ఈ పవన్ కల్యాణ్ కు లేదు అన్నట్టుగా నిన్న మాట్లాడాడు. చిరంజీవి గారు పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆయనతో చాలా క్లోజ్ గా పనిచేశాను. కానీ పవన్ కల్యాణ్ అనే వ్యక్తి నన్ను పోషించినట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు. అతడి దయాదాక్షిణ్యాలపై నేను బతికినట్టు, నాకేదో బతుకుదెరువు లేక ఇతడి వద్ద చేతులు కట్టుకుని నిలబడ్డట్టు మాట్లాడుతున్నాడు.

నేను జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలో 1995 నుంచే ఆదాయపన్ను చెల్లిస్తున్నాను. నేను ఈనాడులో 2008లో ఉద్యోగం వదిలేసే సమయానికి నా జీతం లక్ష రూపాయలు. నేనేదో డొక్కు స్కూటర్ వేసుకుని వచ్చినట్టు, అతడి దగ్గర చేతులు కట్టుకుని నిలబడినట్టు ఏదో సీన్ క్రియేట్ చేస్తున్నాడు. 

పార్టీ పెట్టాలనుకున్నప్పుడు వాళ్లు పిలిస్తేనే టీమ్ లోకి వెళ్లాను తప్ప... నేనేమీ అతడి టచప్ బాయ్ ని కాను, అతడికి గొడుగు పట్టుకునే వాడ్ని కాను. నా వరకు చూస్తే... ఆ రోజు నువ్వు చిరంజీవి తమ్ముడివి... పార్టీలో నువ్వు కూడా పనిచేస్తున్నావు. అంతకుమించి నీకు, నాకు ఏ సంబంధం లేదే. 

తనను తాను గొప్పగా ఊహించుకుంటే తప్పు లేదు కానీ, ఇతరులను చాలా దుర్మార్గంగా మాట్లాడడం అలవాటైపోయింది. నేను కింది నుంచి జర్నలిస్టుగా ఎదిగినవాడ్ని... నీ క్వాలిఫికేషన్ ఏంటి... టెన్త్ క్లాసు! ఎదుటివాళ్లను మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. 

చిరంజీవి గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారంటున్నాడు... నేను అది దీవెన అనుకుంటాను. నీ ప్రొఫెషన్ నీకు ఎవరు వేసిన భిక్ష... చిరంజీవి గారు వేసిన భిక్షే కదా! ఆ విషయం ఒక్కరోజైనా చెప్పావా? ఇవాళ కూడా నేను చెప్పుకుంటా... నేను చిరంజీవి వల్లే రాజకీయాల్లోకి వచ్చాను, ఎమ్మెల్యే అయ్యాను. ప్రజారాజ్యం విలీనం అయ్యాక ఇండిపెండెంట్ గా పోటీ చేశాను. పవన్ కల్యాణ్ ఈ విషయం తెలుసుకోవాలి. 

24 సీట్లు తీసుకుంటున్నాను అని చెప్పి గాయత్రీ మంత్రంతో పోల్చాడు. కానీ అందులోనూ 21కి తగ్గించుకుని చంద్రబాబు చెప్పిన వాళ్లకు టికెట్లు ఇచ్చి, మిగిలినవి ఏమైనా ఉంటే జనసేన వాళ్లకు ఇచ్చాడు. పార్టీ  కోసం నీతో పాటు పదేళ్లపాటు రోడ్లపై తిరిగిన వారికి టికెట్లు ఇచ్చావా? పితాని బాలకృష్ణకు, సరోజకు, శేఖర్ కు, పోతిన మహేశ్ కు, శేషు కుమార్, రాజబాబుకు టికెట్లు ఇచ్చావా? చంద్రబాబు వలలో పడి గిలగిల్లాడుతూ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మాపై చూపిస్తే ఎలా? చంద్రబాబు వల్లో పడితే పవన్ కల్యాణే కాదు, ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారు. 

ప్రజారాజ్యం విలీనానికి నేను కారకుడంటున్న పవన్... ఆ విషయాన్ని చిరంజీవిని అడిగి తెలుసుకోవచ్చు కదా! ఎవరి వల్ల విలీనం జరిగిందనేది చిరంజీవిని అడగొచ్చు కదా!

ఇక, చిరంజీవి, ప్రభాస్ వెళ్లి సీఎం జగన్ ను కలిస్తే ఆ ఫొటోలు  లీక్ అయ్యాయట. వారు సీఎంను కలవడానికి, ఆ ఫొటోలు లీక్ కావడానికి నాకేంటి సంబంధం? ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసింది నేనా? నేనేమైనా అపాయింట్ మెంట్ కుదిర్చానా? నేమైనా మధ్యలో రాయబారం చేశానా? వాళ్ల మీటింగ్ గురించే నాకు తెలియదు" అంటూ కన్నబాబు వివరణ ఇచ్చారు.

More Telugu News